అరేయ్ తమ్ముడూ... నీ బావ రాక్షసుడు, ఈసారి రాఖీ కట్టేందుకు నేను వుండనేమోరా

ఐవీఆర్

సోమవారం, 4 ఆగస్టు 2025 (17:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా ఉయ్యూరు విషాదకర ఘటన చోటుచేసుకున్నది. పెళ్లైన ఆరు నెలలకే భర్త వేధింపులను తట్టుకోలేని 24 ఏళ్ల వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉయ్యూరుకి చెందిన రాంబాబు అనే వ్యక్తి 24 ఏళ్ల శ్రీవిద్యను ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. శ్రీవిద్య ఎంఎస్సీ చేసి ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. రాంబాబు ఉయ్యూరు కలవపాముల గ్రామానికి విలేజ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఐతే పెళ్లైన నెల రోజుల నుంచే శ్రీవిద్యను రాంబాబు హేళన చేయడం, అందరి ముందు ఎగతాళిగా మాట్లాడటంతో పాటు భౌతిక దాడి కూడా చేసేవాడు.
 
తనపై తన భర్త చేస్తున్న వేధింపులను ఇంట్లో వారికి చెప్పుకునే బాధపడేది. ఐతే తల్లిదండ్రులు వచ్చేయమన్నా, భర్త మారతాడని ఆశతో ఎదురుచూసేది. ఐతే అవన్నీ ఎండమావులే అయ్యాయి. రాంబాబు వేధింపులు, భౌతిక దాడి తట్టుకోలేని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో శ్రీవిద్య రాసిన సూసైడ్ నోట్ వారికి లభించింది. అందులో ఆమె తన కన్నీటి వ్యధనంతా చెప్పుకున్నది.
 
" నాన్నా... నీవంటే నాకు ఎంతో ధైర్యం. కానీ నా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నాను. అతడు నా జుట్టు పట్టుకుని మంచానికేసి కొడుతుంటే తలంతా నొప్పి పెడుతోంది. వేరే అమ్మాయి దగ్గర నన్ను హేళన చేసి మాట్లాడతాడు. ఆ అమ్మాయి ముందు నేను పనికిరాను అంటూ హేళన చేస్తాడు. ప్రతిరోజూ మద్యం సేవించి నన్ను హింసిస్తున్నాడు. నాన్నను, నన్నూ ప్రతిసారీ నోటికి వచ్చిన బూతులు తిడుతున్నాడు. తమ్ముడూ.. వచ్చే రాఖీ పండుగ దాకా కూడా నేను వుండనేమోరా.. నాన్నను, అమ్మను జాగ్రత్తగా చూసుకోరా. నా ఈ స్థితికి కారణమైన నా భర్తను, అతడి కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు" అంటూ సూసైడ్ నోట్‌లో రాసింది శ్రీవిద్య. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు