ఆరో తరగతి చదువుతున్న బాలికతో యువకుడి పెళ్లి..!!

వరుణ్

శుక్రవారం, 5 జులై 2024 (14:01 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో ఓ మైనర్ బాలికకు తల్లిదండ్రులే వివాహం చేశారు. ఆరో తరగతి చదువుతున్న తమ కుమార్తెకు తల్లిదండ్రులే ఈ పనికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని పాఠాశాల ఉపాధ్యాయులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, పాలమూరు జిల్లా గండీడ్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బీరుప్ప అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఆరో తరగతి చదివే బాలికను వివాహం చేసుకున్నాడు. వేసవి సెలవులు కావడంతో జూన్ నెలలో బాలికకు వివాహం చేసినట్టు తెలిపారు. 
 
ఈ క్రమంలో ఇటీవల మళ్లీ పాఠశాలలు ప్రారంభం కావడంతో బాలిక స్కూల్‌కు వెళ్లింది. అయితే, ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన ఉపాధ్యాయులు అనుమానం వచ్చి జిల్లా అధికారులకు సమాచారం అందించారు. పాఠశాలకు వచ్చిన అధికారులు బాలిక వద్ద ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆ బాలికను స్టేట్ హోంకు తరలించారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు బీరప్పతో పాటు తల్లిదండ్రులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు