విశాఖకు నెలరోజుల్లో తరలింపు?... జోరుగా భవనాల అన్వేషణ

శుక్రవారం, 27 డిశెంబరు 2019 (15:00 IST)
విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్నీ నడిచిపోతున్నాయి. రాజధాని ఏర్పాటుకు ప్రస్తుతం కావలసినవి భవనాలే. ఇప్పటికిప్పుడు భారీ భవంతులు నిర్మించే యోచన ప్రభుత్వానికి లేదు. నెల రోజుల్లో వీలైనంత వరకు ఎన్ని కార్యాలయాలకు భవనాలు లభిస్తే... అన్నీ విశాఖపట్నం తరలించాలనేది యోచనగా కనిపిస్తోంది. ఆ మేరకు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. అందుకే కొన్ని శాఖల అధికారులు సొంతంగా విశాఖపట్నంలో తమ కార్యాలయాలకు భవనాలు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడ ఆ శాఖ తరపున పనిచేస్తున్న అధికారులకు ఆఫీసుకు అవసరమైన మంచి భవనం వుంటే చూడాలని, వాటి ఫొటోలు పంపాలని సూచిస్తున్నారు. 
 
అలాగే అమరావతి నుంచి విశాఖపట్నం రావలసి వుంటుందని భావిస్తున్న అధికారులు కూడా కుటుంబంతో వుండడానికి ఏ ప్రాంతమైతే బాగుంటుంది?, అక్కడ ఏమైనా ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయా? అద్దె ఎంత? కొంటే ఎంత? అంటూ ఆరా తీస్తున్నారు. రుషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్‌ -1లోనే సచివాలయం వస్తుందని విశ్వసనీయ సమాచారం. ఇందులో నాలుగు అంతస్థులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. కిందనున్న మరో నాలుగు అంతస్థుల్లో ఓ ఐటీ కంపెనీ నడుస్తోంది. ఇక్కడ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. 
 
దీనిపక్కనే టవర్‌-2 నిర్మాణం చకచకా జరుగుతోంది. ఇది పూర్తయితే మరో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది. ఆ పక్కనే ఉన్న స్టార్టప్‌ విలేజీని సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగిస్తారని ప్రచారం జరుగుతోంది. స్టార్టప్‌ విలేజ్‌లో 50 వేల చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉంది. అంతే విస్తీర్ణంలో పార్కింగ్‌ సదుపాయం ఉంది. వీటికి 50 మీటర్ల దూరంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సోదరుడు జి+4 భవన నిర్మాణం చేస్తున్నారు. అది కూడా ఇంకో మూడు నెలల్లో పూర్తి కానుంది. ప్రభుత్వం కోరితే దానిని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఇంకో వంద మీటర్ల దూరాన ఐబీఎం కంపెనీ ఉంది. నాలుగు ఎకరాల్లో నిర్మించిన భవనంలో ప్రస్తుతం 200 మంది మాత్రమే ఒక షిఫ్టులో పనిచేస్తున్నారు. వారిని కూడా ఇతర నగరాలకు పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంటే ఐబీఎంతో చర్చిస్తే...ఆ భవనం కూడా తీసుకోవచ్చు. 
 
హిల్‌ నంబర్‌ 2లో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు చెందిన న్యూనెట్‌ కంపెనీ మూడు ఎకరాల్లో నిర్మించారు. 70 వేల చదరపు అడుగుల స్థలం ప్లగ్‌ అండ్‌ ప్లేతో రెండీగా ఉంది. దీని పక్కనే మిరాకల్‌ కంపెనీ ఇటీవల రూ.6 కోట్లకు కొనుగోలు చేసిన భవనం ఉంది. దానిని కూడా తీసుకోవచ్చు. రుషికొండలో ఐటీ పార్కుకు వెళుతున్న మార్గంలో ఆదిత్య కంపెనీ భారీ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టింది. అది పూర్తి కావచ్చింది. అందులో వందకుపైగా ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ పక్కనే వుడా గతంలో నిర్మించిన రో హౌసింగ్‌ విల్లాలు 70 ఉన్నాయి. అందులో కొన్నింటిని అద్దెకు తీసుకోవచ్చు. వీటన్నింటినీ వైసీపీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి మ్యాపులతో సహా పరిశీలించినట్టు తెలిసింది.
 
విప్రో కూడా...  
నగరం నడిబొడ్డున విప్రో సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దన్నర క్రితం ఏడు ఎకరాలు కేటాయించింది. అందులో మూడు ఎకరాలను మాత్రమే విప్రో ఉపయోగించుకుని భవనం నిర్మించింది. దానిని కూడా పల్సస్‌ కంపెనీకి అద్దెకు ఇచ్చింది. అదే ఆవరణలో ఇంకో నాలుగు ఎకరాలు ఖాళీగా ఉంది. దానిని సెజ్‌గా అభివృద్ధి చేస్తామని, అనుమతించాలని గత సీఎంను విప్రో యాజమాన్యం కోరితే అంగీకరించారు. ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు విప్రో భవనాన్ని కూడా ప్రభుత్వ అవసరాలకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
అందులో భాగంగా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి అక్కడ ఏమి జరుగుతున్నదో తెలుసుకోవడానికి శనివారం వెళ్లి వచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఐటీ కంపెనీలకు డీటీపీ పాలసీని అమలు చేసింది. అంటే...ఏదైనా భవనాన్ని ఐటీకి పూర్తిగా అద్దెకు ఇస్తే... డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌(డీటీపీ) పాలసీ కింద ఆ భవనం అద్దెలో 50 శాతం ప్రభుత్వమే చెల్లించి, మిగిలిన 50 శాతం కంపెనీలు చెల్లించుకునేలా ఒప్పందం జరిగింది. అలా చాలా భవనాల్లో ఐటీ కంపెనీలు నడుస్తున్నాయి.
 
వాటిని కూడా ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. సిరిపురంలో వివానా హోటల్‌ ఎదురుగా ఒక భవనం ఆ విధంగానే నడుస్తోంది. అలాగే సిరిపురం వీఐపీ మార్గంలో భారీ భవనాల్లో కొన్ని అంతస్థులను ఐటీకి డీటీపీలో కేటాయించారు. విప్రో ఎదురుగా టెక్‌ మహీంద్రాలో కొన్ని అంతస్థులను పాత్ర, డబ్ల్యుఎన్‌ఎస్‌ కంపెనీలకు కేటాయించారు. అవి పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయా? లేదా? అని అధికారులు ఆరా తీస్తున్నారు. వారు ఉపయోగించుకోనట్టయితే వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే టెక్‌ హబ్‌లో ఎపీటా కార్యాలయం ఉండేది. వారు ఖాళీ చేసేశారు.
 
దాని గురించి కూడా ఆరా తీస్తున్నారు. మధురవాడలో ఐటీ పార్క్‌కు దగ్గరగా వుడా గతంలో నిర్మించిన హరిత ప్రాజెక్టులో 640 ఫ్లాట్లు నిర్మించి విక్రయించారు. అందులో 20 నుంచి 30శాతమే ఉంటున్నారు. మిగిలినవి ఖాళీగా ఉన్నాయి. సుమారుగా 20 ఎకరాల్లో నిర్మించిన ఆ ప్రాజెక్టులో భారీ రహదారులు, విస్తృతమైన పార్కింగ్‌, సామాజిక భవనం, ఆస్పత్రి, వాకింగ్‌ ట్రాక్‌ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఆ ఫ్లాట్లను అద్దెకు తీసుకుంటే... ఎలా వుంటుందని అధికారులు యోచిస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమకు అందుబాటులో వున్న సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు. అనుకూలతలను బట్టి ఆయా ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు