చంద్రబాబు కన్నా నటుడు శివాజీ గ్రేటా? ఎలా?

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (11:41 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తను దేశంలోనే సీనియర్‌ పొలిటీషియన్‌ అని చెప్పుకుంటారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ వంటివి ఏర్పాటు చేసి దేశ ప్రధానులను నిర్ణయించిన చరిత్ర తనదని చెబుతారు. కానీ ఢిల్లీలో ఏం జరుగుతోందో చెప్పే నాధుడే లేరు. అదే మన హీరో శివాజీని తీసుకోండి… సాధారణ నటుటే అయినప్పటికీ దేశ రాజధానిలో ఏమి జరుగుతోందో ఎప్పటికప్పుడు వెండితెరపై సినిమా చూసినట్లే చెప్పేస్తున్నారు మరి. సిబిఐ ఏం చేయబోతోంది, ఈడి ఎలాంటి ఎత్తులు వేస్తోంది, ఎప్పుడు ఎవరు... ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు అని క్షణాల్లో సమాచారం అందుతోంది.
 
చంద్రబాబుకు వ్యతిరేకంగా ‘ఆపరేషన్‌ గరుడ’ అమలవుతోందని చెప్పిన ఆయన తాజాగా బాబుపైన కుట్ర తీవ్రం అవుతోందని కూడా టివి ఛానళ్ల సాక్షిగా ప్రకటించారు. శివాజీ చెప్పే ఆపరేషన్‌ గరుడగానీ, నోటీసుల వ్యవహారంగానీ…. ఎంతో పలుకుబడి వున్న చంద్రబాబుకు ఎందుకు తెలియడం లేదు? బాబుగారి కంటే శివాజీకే ఎక్కువ పలుకుబడి ఉందా? కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్లో శివాజీకే ఎక్కువ సోర్స్‌ వుందా? 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న బాబుకు, ఢిల్లీలో చక్రం తిప్పగల బాబుకు అంతమాత్రం సమాచారం తెప్పించుకోగల సోర్స్‌‌ లేదా? ఇటువంటి ప్రశ్నలు సహజంగా కలుగుతాయి.
 
సమైక్యాంధ్ర కోసం నిలబడుతున్నట్లు ఫోజు పెడుతూ రాజకీయ తెరపైకి వచ్చిన శివాజీ మెల్లగా తన నిజస్వరూపం ఏమిటో బయటపెట్టుకుంటూ వస్తున్నారు. ఆయన టిడిపి చేతిలో ఆటబొమ్మ అని చాలామంది చాలా ముందు నుంచే అనుమానిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. చంద్రబాబుపై దాడి చేయడమంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపైన దాడి చేయడమేనట. 
 
ఒకవేళ ప్రభుత్వ పెద్దలు అవినీతి అక్రమాలకు పాల్పడి వుండి, దానిపైన విచారణ వంటిది జరిపిస్తే… అది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపైన దాడి చేసినట్లు అవుతుందా? కోట్ల మంది ఓట్లు వేసి, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్‌పై విచారణ కూడా ఆంధ్ర ప్రజలపై దాడేనా? తెలుగుదేశం ప్రయోజనాలను కాపాడటానికే శివాజీ ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోడానికి ఇంతకంటే పెద్ద ఆధారాలు అవసరం లేదనే వాదనలు సైతం వస్తున్నాయి.
 
చంద్రబాబుకు నోటీసులు రాబోతున్నాయని శివాజీ చెప్పారో లేదో… వర్ల రామయ్య ప్రెస్‌మీట్‌ పెట్టి హడావుడి చేశారు. యనమల రామకృష్ణుడు ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసి ఖండించారు. చంద్రబాబు కూడా కుట్ర అంటూ వ్యాఖ్యలు చేశారు. అయినా… శివాజీకి ఉన్న విశ్వసనీయత ఏమిటి? అతను చెప్పే మాటలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? వాస్తవం ఎంతవున్నదో తెలుసుకోకుండా… ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా స్పందించాల్సిన అవసరం ఉందా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలా స్పందించడమంటే టిడిపి నేతలు తమను తాము తగ్గించుకోవడం కాదా? అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు