జయ వారసుడు అజిత్ అంటూ దక్షిణాది మీడియా.... 'తల' ఏమీ మాట్లాడటం లేదేంటి?

శనివారం, 8 అక్టోబరు 2016 (19:21 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన తర్వాత, ఆసుపత్రిలో ఆమె ఎలా ఉన్నదంటూ ఫోటోలు బయటకు రాకపోవడం... తదితర కారణాలతో అన్నాడీఎంకే కార్యకర్తల్లో ఆందోళన నెలకొని ఉంది. వారంతా అపోలో ఆసుపత్రి వద్దే బస చేస్తున్నారు. మరికొందరు ఎక్కడికక్కడ అమ్మ సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తిరిగి రావాలంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరికొందరు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరై అమ్మను కాపాడాలంటూ శ్రీవారిని వేడుకుంటున్నారు.
 
ఇదిలావుంటే జయలలిత మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పడంతో ప్రభుత్వాన్ని నడిపేందుకు డిప్యూటీ ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. మరోవైపు జయ దత్తపుత్రుడిని నేను అంటూ రెండ్రోజుల క్రితం ఓ వ్యక్తి అపోలో ఆసుపత్రి వద్ద హంగామా చేశాడు. ఆ తర్వాత జయలలిత తన మేనత్త అనీ, ఆమె వారసురాలిని నేనేనని చెపుతూ మరో మహిళ గందరగోళం సృష్టించింది. 
 
ఇవన్నీ ఇలావుంటే అనూహ్యంగా తమిళనాడులో "తల" అని పిలుచుకునే నటుడు అజిత్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. అతడే జయలలిత వారసుడు అంటూ దక్షిణాది మీడియాలో కథనాలు వస్తున్నాయి. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, కర్నాటక, కేరళలో నటుడు అజితే ఆమెకు వారసుడని చెపుతూ కథనాలు వస్తున్నాయి. ఈ ప్రచారం దాదాపుగా వారం రోజుల నుంచి జరుగుతూ ఉండగా నటుడు అజిత్ మాత్రం దీనిపై నోరు మెదపడంలేదు. అవునని కానీ కాదని కానీ చెప్పడం లేదు. మరి ఆయన ఉద్దేశ్యం ఏమిటో....?

వెబ్దునియా పై చదవండి