కల్కి ఆశ్రమాల్లో ఐటీ సోదాలు, ఎంత డబ్బు పట్టుకున్నారో తెలిస్తే షాకే..

శుక్రవారం, 18 అక్టోబరు 2019 (18:35 IST)
పైకి అదొక ఆధ్యాత్మిక ప్రపంచం, అయితే అక్కడ జరిగేదంతా రహస్యం.. అయితే ఆ గుట్టు బట్టబయలయ్యే సమయం వచ్చింది. విష్ణుమూర్తి దశావతారం చెప్పుకొనే వేలకోట్ల ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని విస్తరించిన కల్కి కోట రహస్యం ఐటీ దాడుల నేపథ్యంలో బాహ్య ప్రపంచానికి తెలిసే పరిస్థితి వచ్చింది. 
 
విష్ణు భగవానుడు దశావతారాలలో చివరిదైన కల్కి అవతారం తానేనని దశాబ్దాలుగా వేలాది భక్తులకు చెపుతూ వచ్చిన విజయ్ కుమార్ నాయుడు అవతార రహస్యం బట్టబయలయ్యే సమయం ఆసన్నమైంది. చిత్తూరు జిల్లాలో ఐదు ఎకరాలతో మొదలై వేలాది ఎకరాల్లో విస్తరించిన కల్కి భగవాన్ సామ్రాజ్యంలో గుట్టు బయటకు ప్రపంచానికి తెలిసేలా పరిస్థితి మారుతోంది. తొలిసారిగా చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంతో పాటు తమిళనాడు, హైదరాబాద్‌లో ఉన్న కల్కి ఆశ్రమ కార్యాలయాలపై ఐటీ బృందాల ఆకస్మిక దాడులు జరుగుతున్నాయి. 
 
గత మూడేళ్లుగా పన్నులు సక్రమంగా చెల్లించలేదన్న సమాచారంతో ఐటీ సిబ్బంది కల్కి భగవాన్‌కి చెందిన ఆశ్రమాలతో పాటు కార్యాలయంలో ఇతర ఆస్తులపై మెరుపు దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన కీలకమై డాక్యుమెంట్లతో పాటు కోట్లాది రూపాయల లెక్క చెప్పని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇక కల్కి భగవాన్‌గా చెప్పుకొని వివిధ చోట్ల ఆశ్రమాలు స్థాపించిన విజయ్ కుమార్‌కు భార్య పద్మావతి, కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతి ఉన్నారు. విజయ్ కుమార్ తాను కల్కి భగవాన్‌గా భార్య పద్మావతి అమ్మ భగవాన్‌గా ప్రచారం చేశారు. ఇక విజయ్ కుమార్ నాయుడు అలియాస్ కల్కి భగవాన్ వివరాల్లోకి వస్తే మొదట్లో ఎల్ఐసిలో క్లర్కుగా జీవితాన్ని ప్రారంభించారు. 
 
ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలి 1989లో కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను ప్రారంభించారు. తర్వాత స్కూలు సరిగా జరగక పోవడంతో మూతపడింది. అనంతరం కొంతకాలం తర్వాత సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెంలో కల్కి భగవాన్‌గా అవతారం ఎత్తారు. అక్కడ ఐదు ఎకరాల స్థలాన్ని కొని అందులో కల్కి ఆశ్రమాన్ని స్థాపించారు.
 
ఇలా ప్రారంభమైన ఆధ్యాత్మిక అవతారం అనుకూల ఫలితాన్ని ఇవ్వడంతో రామకుప్పంలో ఏర్పాటు చేసిన స్కూల్‌ను కూడా సత్యలోకం పేరుతో ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. ఇక తానే విష్ణుమూర్తి అవతారమైన కల్కి భగవాన్ అంటూ విస్తృతంగా ఏపీతో పాటు తమిళనాడులోనూ ప్రచారం చేశారు. దీంతో క్రమంగా భక్తులు పెరగసాగారు. ఇలా కల్కి ఆశ్రమానికి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక ధ్యానంలో శిక్షణ తరగతులు నిర్వహించేవారు. రెండుమూడు రోజుల నుంచి వారం రోజుల దాకా కూడా ఈ తరగతులు జరిగేవి.
 
ఇలా ఆశ్రమానికి వచ్చే భక్తుల దగ్గర కల్కి ఆశ్రమ నిర్వాహకులు భారీ మొత్తంలో వసూళ్లు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కల్కి భగవాన్ దర్శించాలంటే 5 వేల నుంచి 25 వేల దాకా సమర్పించుకోవాల్సి వచ్చేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో భక్తులు దగ్గర వసూలు చేయడమే కాకుండా స్థానికంగా భూమి కొనుగోళ్లపై అక్రమాలు జరిగాయని కల్కి ఆశ్రమం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కల్కి భగవాన్‌తో పాటు ఆయన కుమారుడు కృష్ణాజీ పైన భూ ఆక్రమణలకు చేసినట్టు ఫిర్యాదులు ఉన్నాయి.
 
ఇక 2008లో వరదయ్యపాలెం మండలం బత్తల వల్లం గ్రామంలో నిర్మించిన భారీ ఆధ్యాత్మిక భవనం గోల్డెన్ సిటీ ప్రారంభం సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు భక్తులు మృతి చెందగా అనేకమంది గాయపడ్డారు. దీంతో పెద్ద ఎత్తున ఆశ్రమంపై విమర్శలు వచ్చాయి. ఈ కారణంగా కొన్ని రోజుల పాటు ఆశ్రమాన్ని మూసివేయాల్సి వచ్చింది. తర్వాత కొన్నాళ్లకు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించారు. 
 
అయితే నూతన భవనానికి గోల్డెన్ సిటీ అన్న పేరును మార్చి వన్‌నెస్ అనే పేరు పెట్టడం చర్చనీయాంశమైంది. ఆ పేరును మళ్లీ తర్వాత కాలంలో మార్చి ఏకం అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఓ అండ్ వో అకాడమిగా పేరు పెట్టారు. అలాగే  కల్కి రూరల్ డెవలప్మెంట్ పేరుతో స్థానిక గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. తర్వాత దానికి కూడా పేరు మార్చి వన్ హ్యుమానిటీ కేర్‌గా పేరు మార్చారు. ఇక ఆశ్రమాలు లావాదేవీలన్నీ మొదట కల్కి ట్రస్ట్ పేరుతో జరిగేవి. అయితే తర్వాత కాలంలో గోల్డెన్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో లావాదేవీలు కొనసాగుతున్నాయి.
 
ఇక కల్కి ఆశ్రమంలో సుమారుగా 15 వందల మంది దాకా సిబ్బంది పని చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరందరికీ నెలవారీ వేతనాలు చెల్లిస్తున్నారు. గతంలో ఆశ్రమానికి వచ్చే విరాళాలు, కొనుగోళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఐటీ రిటర్న్స్ చూపించేవారు. ప్రభుత్వానికి కూడా సక్రమంగా పన్నులు చెల్లించేవారు కానీ దాదాపు మూడేళ్లుగా పన్నులు సక్రమంగా చెల్లించడం లేదని సమాచారం. అదేవిధంగా ఐటీ రిటర్న్స్ కూడా చేయకపోవడంతో కల్కి ఆశ్రమ పైన ఐటీ దాడులు జరిగినట్టుగా సమాచారం.
 
ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంలో ఉన్న ప్రధాన ఆశ్రమంతో పాటు తమిళనాడు, హైదరాబాదులో ఉన్న కార్యాలయాల్లో కూడా ఐటీదాడులు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ దాడిలో ఎలాంటి విషయాలు బయటపడతాయి అన్నది వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు