పాపం పన్నీర్ సెల్వం... జయ ఫోటో జేబులో పెట్టుకుని నెగ్గుకురాగలరా...? శశికళ పవరెంతో...?

గురువారం, 8 డిశెంబరు 2016 (15:47 IST)
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వం పదవీబాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. జయలలిత మరణం తర్వాత ఏఐడీఎంకే పార్టీని నడిపించే బాధ్యతను శశికళకు అప్పగించారు. ఇలా రెండు పదవులు చెరొకరి దగ్గర ఉన్నాయి. ఈ నేపధ్యంలో జయలలిత ఫోటోను జేబులో నుంచి బయటకు తీసి ఒక్కసారి కళ్లకు అద్దుకుని పని ప్రారంభించే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. ప్రతి పనికి శశికళ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఈ స్థితిలో ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. 
 
మరోవైపు అన్నాడీఎంకెలో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయంటున్నారు. పదవి కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఓ సీనియర్ ఎమ్మెల్యే తనకు ఉన్నఫళంగా పదవి ఇవ్వాలనీ, లేదంటే తన వెనుక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బెదిరిస్తున్నట్లు సమాచారం. ఐతే ఈ బెదిరింపులు అమ్మ హయాంలో నిల్లు. ఒకవేళ ఎవరైనా మాట్లాడాలనుకున్నా అవి పెదవి దాటి రావు. 
 
ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర పొరబాటున గుసగుసగా వినిపించినా తెల్లారేసరికి సదరు నాయకుడిపై అన్ని వేట్లూ పడేవి. అంతలా ఉండేది జయ నెట్వర్క్. పవర్. దీనికి కారణం... ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్ష పదవి రెండూ ఆమె వద్దనే ఉన్నాయి. పార్టీకి సంబంధించినవి, ప్రభుత్వం అంతా ఆమె కనుసన్నల్లోనే నడిచేది. ఇప్పుడు అమ్మ పరమపదించడంతో పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నదని చెప్పక తప్పదు. లుకలుకలు బయటపడితే పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడవచ్చు. కనుక కేంద్రంలో చక్రం తిప్పుతున్న భాజపా సహకారం అన్నాడీఎంకెకు తప్పనిసరి అనే వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పార్టీ పగ్గాలను కూడా పన్నీరుకు అప్పజెపితే పరిస్థితి పటిష్టంగా ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి పన్నీర్ సెల్వం ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి