ప్రత్యక్ష రాజకీయాల్లోకి జనసేన ఇప్పుడే వచ్చే పరిస్థితుల్లో లేదు. ఇప్పటికిప్పుడు వచ్చినా చేసేది కూడా ఏమీ ఉండదని అధినేత పవన్ కళ్యాణ్కు అర్థమైంది. అందుకే కేవలం ట్విట్టర్ ద్వారానే ఆయన పార్టీని నడుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీకి ఇప్పుడు అభిమానులు ఉన్నారు గానీ వారు రాజకీయ నాయకులు కారు. సినిమా అభిమానులే. అయితే వారిని ఓటుగా ఎలా మలుచుకోవాలనే దానిపై పవన్ దగ్గర సరైన వ్యూహం లేదు. గతంలో ఆయన సోదరులు చిరంజీవి కూడా ఇలాంటి తప్పిదమే చేసినా కొన్ని సీట్లు వచ్చాయి.
కొంతకాలం పార్టీని నడిపారు. కానీ జనసేన ఆ మాత్రం కూడా నడపకలేకపోతోందన్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు అధినేత ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్నారని అందరికీ తెలిసిందే. ఎప్పుడో పుట్టిన వైసిపి కూడా ఇన్నాళ్ళయినా ఇంకా క్షేత్రస్థాయిలో సరైన యంత్రాగం లేదు. నాయకులు మాత్రమే ఉన్నారు. అభిమానించే ప్రజలు ఉన్నారు. కానీ వారిని ఓట్ల రూపంలో మార్చే వ్యవస్థ లేదు. ఫలితంగానే 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు జనసేనకు నాయకులు లేరు. ఓటర్లు లేరు. సినీ అభిమానులే ఉన్నారు. వారిని నమ్ముకుని పార్టీని నడపటం అనేది సాహసమే.
పవన్ కళ్యాణ్కు ఇప్పుడు సమయం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళి పార్టీని నడపటం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని మాత్రం కాదు. కారణం ఆయనకు ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిని పూర్తి చేయకుండా ఆయన ఎలాంటి పనులూ చేపట్టలేరు. ఈ నాలుగు సినిమాలు పూర్తయ్యే సరికి 2019 సంవత్సరం వస్తుంది. అప్పుడే ఎన్నికలు కూడా వస్తాయి. ఈలోగా పార్టీ నిర్మాణం అనేది సాధ్యమయ్యే పనికాదు. కాబట్టి 2019 నాటికి ఎన్నికల్లో పోటీ ఇచ్చే అంత పరిస్థితి మాత్రం జనసేనకు ఉండదనేది అర్థం అవుతుంది. ఈలోగా అటు బీజేపీ గానీ, ఇటు తెలుగుదేశంగానీ జనసేనను మద్దతు కోరతాయి. సీట్ల ఒప్పందాలు చేసుకుంటాయి. ఇవేమీ కాకపోతే వామపక్షాలు ఎలాగూ ఉన్నాయి. ఇప్పటికే సిపిఐతో మంతనాలు జరిగాయి. జనసేతో కలిసి నడిచేందుకు సిద్దమని సిపిఐ ఇప్పటికే ప్రకటించింది. జనసేన అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి వేచి చూడాల్సిందే.