ఈసారి దీపావళి పండుగ ఎప్పుడు చేసుకోవాలనేది పెద్ద సందేహంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు దీనిపైనే చర్చించుకోవడం కనబడుతోంది. ఎందుకంటే అక్టోబరు 18న అమావాస్య కనుక ఆ రోజునే దీపావళి జరుపుకోవాలని కొందరు అంటున్నారు. పంచాంగకర్తలు మాత్రం... అక్టోబర్ నెల 17నే దీపావళి పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు.
సాధారణంగా నిర్ణయ సింధు ప్రకారం పండుగలను నిర్ణయిస్తుంటారని పంచాంగకర్తలు తెలిపారు. ఇందులో పదిమంది పండితులుంటారని, వీరిలో తొమ్మిదిమంది ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు అదే నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు పాటించేవారని, కాని 1987వ సంవత్సరం నుంచి ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పంచాంగకర్తలు తెలిపారు.
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో చతుర్దశి అక్టోబర్ నెల 17న వస్తుంది. దీనికి అనుగుణంగా దీపావళి పండుగను ఉదయాత్పూర్వం తలంటు స్నానం చేసుకుని పండుగను జరుపుకోవాలంటున్నారు పంచాంగకర్తలు, దీంతోపాటు సాయంత్రం లక్ష్మీపూజను యథావిధిగా జరుపుకోవాలంటున్నారు పెద్దలు.
మరుసటి రోజు అక్టోబర్ నెల 18న అమావాస్య వస్తుంది కనుక ఆ రోజు కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని పాటిస్తారు. దీంతో దీపావళి పండుగపై తలెత్తిన సందేహానికి తెరపడింది. పండుగ తేదీ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని, కొందరు తమ తమ క్యాలెండర్లలో తప్పుడు ప్రచారం చేశారని పంచాంగకర్తలు తెలిపారు.