ఉగాదికి భాజపా - తెదేపా దోస్తీపై క్లారిటీ... కార్పొరేట్ నాయకులంటూ గొడవ
శుక్రవారం, 28 మార్చి 2014 (13:00 IST)
WD
మీ బలమెంతంటే మీ బలమెంత అంటూ వాగ్బాణాలు విసురుకున్న తెలుగుదేశం(తెదేపా), భారతీయ జనతా పార్టీ(భాజపా)లు మండుతున్న ఎండల్లానే సలసలమని సెగలు కక్కినా మళ్లీ కూల్ కూల్ అయ్యారు. ఉగాది నాటికి 2014 ఎన్నికల్లో పొత్తుల వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ గురువారం తెదేపా నాయకులతో హైదరాబాద్లో చర్చలు జరిపారు.
రాష్ట్ర భాజపా నాయకులతో మాట్లాడిన అనంతరం సీట్ల సర్దుబాటుపై తెదేపా ఎంపీలు సుజనా చౌదరితో మంతనాలు సాగించారు. ఈ చర్చల్లో తెదేపా ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇదిలావుంటే క్షేత్రస్థాయిలో ఎలాంటి అవగాహన లేని సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి కార్పొరేట్ నాయకులతో పొత్తు చర్చలేమిటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
కనీసం సీనయర్ నాయకులను ఎవరినీ ఈ చర్చల్లో భాగస్వామ్యం చేయకుండా నిర్ణయాలు తీసుకుంటే బెడిసి కొట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న జంప్ జిలానీలను కూడా వీరిద్దరే తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.