ప్రజారాజ్యం పార్టీపై మనసులో మాట ఇప్పుడు చెపుతా... పవన్ కళ్యాణ్
గురువారం, 27 మార్చి 2014 (22:10 IST)
WD
ప్రజారాజ్యం పార్టీ విలీనంపై పవన్ కళ్యాణ్ విశాఖ సభలో స్పందించాడు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావించానని అన్నారు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకూ నోరెత్తలేదని అన్నారు. ప్రజారాజ్యం పార్టీని అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలపడం తనకు తప్పనిపించలేదని చెప్పుకొచ్చాడు.
కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయవలసి వచ్చి ఉంటుందేమో తనకు తెలియదన్నారు. ప్రజారాజ్యం పార్టీని ఎంతో ఉన్నతమైన ఆశయాలతో స్థాపించామని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ ద్వారా తను అన్నయ్య చిరంజీవికి ఎదురెళ్ళేందుకు రాజకీయాల్లోకి రాలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తను వ్యతిరేకించే పార్టీలో అన్నయ్య చిరంజీవి ఉండటం ఆ విధి లీల అని అన్నారు. తాను వ్యక్తి పరంగా ఎవరికీ వ్యతిరేకిని కాననీ, కేవలం సిద్ధాంతాలను మాత్రం వ్యతిరేకిస్తానని చెప్పుకున్నారు. ఈ సందర్భంగా బొత్స, కావూరి, రాయపాటిలను కూడా ఏకిపారేశారు.