వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీమాంధ్ర కోసం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది పండుగ రోజున సీమాంధ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందులో సీమాంధ్రను నూతనంగా నిర్మించాల్సిన అవసరం ఉందని, ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, వికేంద్రీకరణ ఫార్ములాతో అన్ని ప్రాంతాలను అభివృద్ధిపథంలో దూసుకుపోయేలా చేయాలని, సర్వహంగులతో, అందరికీ అనువుగా ఉండే రాజధానిని నిర్మించాలని అందులో పేర్కొన్నారు. ఇలాగే, ఇందులో పేర్కొన్న మరికొన్ని కీలకాంశాలను పరిశీలిస్తే...
ఉత్తరాంధ్ర ఐటీ నగరమైన విశాఖపట్టణం నుంచి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం. సీమాంధ్రలో అన్ని జిల్లాలను అనుసంధానం చేస్తూ కొత్త ర్యాపిడ్ రైల్ వ్యవస్థ ఏర్పాటు. కళింగపట్నం, నర్సాపురం, నిజాంపట్నం, రామాయపట్నం, దుగ్గరాజుపట్నం సహా ప్రతి జిల్లాలో పోర్టుల నిర్మాణం. వీటికి అనుసంధానిస్తూ పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు.
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం. పుట్టపర్తి, కడప, రాజమండ్రి విమానాశ్రయాల్లో రాత్రి పూట కూడా విమానాలు దిగేలా సకల సౌకర్యాల కల్పన. ప్రకాశం, కర్నూలు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో కొత్త విమానాశ్రయాల నిర్మాణం ఏర్పాటు.
కరవు జిల్లాలైన కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సిమెంట్, స్టీల్ పరిశ్రమల ఏర్పాటు. కృష్ణా జిల్లాను ఆటోమొబైల్ హబ్గానూ, ప్రకాశం జిల్లాను గ్రానైట్ హబ్గానూ, పశ్చిమగోదావరి జిల్లాను ఆక్వా హబ్గా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను మాన్యుఫాక్చరింగ్ హబ్లుగా తీర్చిదిద్దడం.
బెంగుళూరు - హైదరాబాద్కు అనుసంధానంగా అనంతపురం - కర్నూలు ఐటీ కారిడార్ ఏర్పాటు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను టెక్స్ టైల్ పరిశ్రమల కారిడార్గా అభివృద్ధి చేయడం. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పొగాకు, పత్తి ఆధారిత కంపెనీల ఏర్పాటు.
కొత్త రాష్ట్రంలో నూతన రైల్వే జోన్ ఏర్పాటు. కొత్త రాజధానికి, హైదరాబాదుకు మధ్య సత్వర రైల్వే వ్యవస్థ. పులికాట్, కొల్లేరు, విశాఖ, హార్స్లీ హిల్స్, పాపికొండలు, బొర్రా గుహలు, వివిధ బౌద్ధ క్షేత్రాలను టూరిజం పరంగా మరింత అభివృద్ధి పరచడం వంటి అనేక అంశాలను ఇందులో పొందుపరిచారు.