గాంధీ డీఎన్ఏ వీరిలో ఉందా : పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న!

గురువారం, 27 మార్చి 2014 (20:41 IST)
File
FILE
మహాత్మా గాంధీ ఇంటి పేరు పెట్టుకున్న ప్రస్తుత కాంగ్రెస్ నాయకుల్లో గాంధీ డీఎన్ఏ ఉందా అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జాతిపిత పేరును ఇంటిపేరుగా పెట్టుకున్నంత మాత్రాన జాతిపితలు కాలేరని వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఐక్యతకు ముప్పు తెచ్చింది కాంగ్రెస్ వాదులేనని పవన్ ఈ సందర్భంగా మండిపడ్డారు. భారత జాతి సమగ్రతకు వాళ్ళు తూట్లు పొడిచారని ఆయన దుయ్యబట్టారు.

విశాఖపట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తాను ప్రత్యేకమైన అజెండాతోనే రాజకీయాల్లోకి వచ్చానని, రోజూ టీవీల్లో కనిపించాలన్న దురద లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థలో సమూల మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపాడు. సంపూర్ణ క్రాంతే జనసేన అజెండా అని వివరించారు.

అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. ప్రజాసేవకు అంకితమయ్యే నాయకులు దొరికేవరకు తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అలాంటి నేతలు దొరికిననాడు రెండు ప్రాంతాల్లోనూ పోటీ చేస్తామని, నవతెలంగాణను నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ సభా ముఖంగా ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి