ఆగస్టు ఒకటో తేదీ నుంచి యూపీఐ చెల్లింపుల్లో మార్పులు

ఠాగూర్

సోమవారం, 28 జులై 2025 (13:17 IST)
ఆగస్టు ఒకటో తేదీ నుంచి యూపీఐ చెల్లింపుల్లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆగస్టు ఒకటో నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తోంది. యూపీఐ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా బ్యాలెన్స్ చెక్, ఆటో పేమెంట్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలు మారనున్నాయి. ఇంతకీ ఏమిటా మార్పులు? యూజర్లపై పడే ప్రభావమెంత?
 
ఒకప్పుడు బ్యాంకు ఖాతాలో ఎంత నగదు ఉందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. యూపీఐ అందుబాటులోకి వచ్చాక ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే వంటి యాప్స్ సాయంతో ఒక్క క్షణంలో తెలుసుకునే వీలుఏర్పడింది. బ్యాంకు శాఖ/ఏటీఎం కేంద్రానికి వెళ్లే అవసరం తప్పింది. ఇలా చెక్ చేసుకునే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి పరిమితీ లేదు. 
 
ఇకపై రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేసుకునేందుకు అనుమతిస్తారు. అలాగే, ఒక మొబైల్ నంబరుపై ఎన్ని బ్యాంకు ఖాతాలు లింక్ అయ్యాయో 25 సార్లకు మించి చూసుకోలేరు. నెట్‌వర్క్ భారం తగ్గించడం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన, అంతరాయం లేని సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులు, యూపీఐ సేవల సంస్థలకు ఎన్పీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది.
 
ఆటో పేమెంట్ లావాదేవీల విషయంలోనూ ఎన్పీసీఐ నిబంధనల్లో మార్పులు చేసింది. సబ్‌స్క్రిప్షన్లు, యుటిలిటీ బిల్లులు, ఈఎంఐలు వంటి ఆటో పేమెంట్లను రద్దీ లేని సమయంలో మాత్రమే నిర్వహించాలి. ఆటో పేమెంట్ రిక్వెస్ట్ పెట్టే సంస్థలు రద్దీ లేని సమయంలోనే యూపీఐ కలెక్షన్ రిక్వెస్ట్‌ షెడ్యూల్ చేయాలి. యూజర్లు చేసే చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు