సాధారణంగా మనిషి యాంత్రిక జీవితానికి అలవాటు పడి తన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేశాడు. జబ్బు ముదిరితేగాని డాక్టరు గుర్తుకురాడు. మన శరీరం తనలో ఉన్న జబ్బులను బయటపెట్టడానికి నొప్పుల రూపంలో చూపిస్తుంది. అలాంటప్పుడు డాక్టరుని సంప్రదించాలి. ఈలోపల కాస్త ఉపశమనం కలగడానికి కొన్ని చిట్కాలు మీకోసం..
కీళ్ళ నొప్పులు-- కీళ్ళనొప్పులు అనగానే మందులు మాత్రలు ఆపరేషన్ లాంటివి ఉంటాయని భయపడుతుంటాం, కాని కొన్ని సూత్రాలు పాటిస్తే కాసింత ఉపశమనం ఖాయం. * సహజంగా కీళ్ళ నొప్పి ఉదయం పూట అధికంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్నచోట ఆయింట్ మెంట్ పూయాలి. * నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి. లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగాపిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టాలి. * తేలిక పాటి వ్యాయామం, సైక్లింగ్, ఈత, నడక కూడా నొప్పులు నివారించడంలో సహకరిస్తాయి. * క్రింద కూర్చునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి. * అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి. * ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, ఉర్లగడ్డలు వాడకూడదు. * విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి..జామపండు, కమలాపండు మొదలైనవి. * వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్జ్యూస్, క్యాబేజ్సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. * కాస్త ఉప్పుకలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆనీటిని పోయాలి.
నడుము నొప్పి * అధికబరువు మోయడం, లేదా ఎక్కువసేపు వంగి పనిచేయడంవలన తరచూ నడుము నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పిని నివారించడానికి కొన్ని చిట్కాలు... * విపరీతమైన నడుమునొప్పి వచ్చినప్పుడు రెండు రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. * నొప్పి తీవ్రమైనపుడు ఐస్ప్యాక్ ఉంచాలి ఆతర్వాత హాట్ ప్యాక్ ఉంచాలి, నొప్పి అలాగే ఉంటే అరగంట తర్వాత మళ్ళీ ఐస్ప్యాక్, హాట్ప్యాక్ ఉంచాలి. * చెస్ట్ (రొమ్ము), కాళ్ళ క్రింద దిండ్లు పెట్టుకుని బోర్లాపడుకోవాలి. * వేడినీళ్ళలో తువ్వాలు ముంచి నొప్పి ఉన్నచోట తాపడం పెట్టాలి. * కొబ్బరినూనెలో కర్పూరం కలిపి కాచిన తర్వాత ఆనూనెను నొప్పిఉన్న చోట పూయాలి. * అల్లం, తెల్లగడ్డలు దంచుకుని కొబ్బరినూనెలో మరగనిచ్చిన నూనె నొప్పిఉన్నచోట పూసిన తర్వాత హాట్ ప్యాక్ ఉంచాలి. * నొప్పి మరీ విపరీతంగా ఉంటే తప్పనిసరిగా డాక్టరుని సంప్రదించండి.
కడుపు నొప్పి * అజీర్తి, అసిడిటీ వల్లకూడా కడుపునొప్పి వస్తుంది. కొంతమంది స్త్రీలకు ప్రసవించిన తర్వాత విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. * అజీర్తి వలన వచ్చే కడుపునొప్పికి నిమ్మరసంలో అల్లం కలిపి తాగితే నొప్పి మటుమాయం. * అసిడిటీ వల్లైతే లెమన్ టీ తాగడం ఉత్తమం. * ఓ కప్పు నీళ్ళలో వేంచిన జిలకర వేసి కాచి వడపోసి తాగాలి. రుతుస్రావంలో తీసుకోవలసిన జాగ్రత్తలు... * మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు, మసాలాలు, తీపు ఎక్కువలేకుండా చూసుకోవాలి. * ఆహారం మితంగా తీసుకోవాలి. * టీ, కాఫీ, కోక్, చాకోలెట్, చల్లనినీరు తీసుకోకూడదు. * ఆహారం తీసుకున్నతర్వాత విటమిన్ బి, కాల్షియం మాత్రలు వాడితే మంచిది. * భోజనంలో చికెన్, కాయగూరలు, పండ్లు, ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. * ఈ సమయంలో ప్రతిరోజు వేడినీటితో స్నానంచేయాలి. * ప్రతిరోజు ఖర్జూర పండు తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంతో కడుపునొప్పిని నివారించుకోవచ్చు.
చెవి నొప్పి * అలర్జీ, విపరీతమైనచలి, ఇతర క్రిములు చెవిలోకి పోవడంవలన, ఇన్ఫెక్షన్ వలన చెవి నొప్పి వస్తుంది. దీనికి కొన్ని సూచనలు. * పడుకున్నప్పుడు,కూర్చున్నప్పుడు,తలనిటారుగావుంచినప్పుడు, చెవినొప్పి వస్తే... * చూయింగ్గమ్ నమలకూడదు. * చల్లటినీరు, చల్లటి పదార్థాలు తీసుకోకూడదు. * స్నానం తర్వాత చెవిలో నీరు పడితే వెంటనే తుడుచుకోవాలి. * చెవిలో బాలతైలం (ఆయుర్వేదం) పోస్తే నొప్పి తగ్గుతుంది.
పంటినొప్పి * పంటినొప్పి ఉన్నప్పుడు అది తక్కువగావుందా లేక ఎక్కువగావుందా తెలుసుకుని దానికి తగ్గ సూచనలు పాటించాలి. కాని పంటినొప్పి గురించి నిపుణులైన పంటి డాక్టర్లే గుర్తించ గలుగుతారు. అయినా కూడా కొన్ని సూచనలు పాటిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. * భోజనం చేసిన తర్వాత, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసి ఉప్పు కలిపిన నీటిని నోట్లోపోసి పుక్కిలించాలి. * నొప్పి ఉన్నచోట లవంగతైలం పూయాలి. * పాలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. * ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఐస్ ముక్కతీసి నొప్పి ఉన్నచోట పెట్టాలి. ఇలా రోజుకు నాలుగుసార్లు చేయాలి. * స్వీట్లు, మిక్చర్ లాంటి కారపు పదార్థాలు తీసుకోవడం నిలిపేయాలి. ఇలా చేస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది.
మెడనొప్పి * విపరీతమైన పని ఒత్తిడి, మనంకూర్చునే పద్దతిలో మార్పు వలన కూడా మెడనొప్పి వచ్చే అవకాశంవుంది. * దీనికి కొన్ని చిట్కాలు పాటిస్తే మెడనొప్పి తగ్గతుంది. * ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవాళ్ళు మధ్య మధ్యలో కాస్త అటూ ఇటూ తిరిగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. * బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తకుండా ఒక కాలి మీదకూర్చుని బరువు ఎత్తితే మెడ పై భారం పడదు. * బోర్లాపడుకోకూడదు. * మెడనొప్పి ఉన్నప్పుడు దిండు వాడకూడదు. * మెడవాచినప్పుడు వేడినీటితో తాపడం పెడితే ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెపుతున్నారు.