జ్వరం వచ్చిన వాళ్ళకి పెసరకట్టు ఎంతో మంచిదండోయ్..

శుక్రవారం, 29 మార్చి 2019 (15:53 IST)
పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన సమృద్ధమైన పోషక విలువలు వీటిలో ఉంటాయి. వీటి వలన మనం ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెసల ఆహారం శరీరానికి మంచి బలాన్ని, కండపుష్టిని కలిగిస్తుంది. వీటితో రక్తక్షీణత, వాత వ్యాధులు, పేగులకు సంబంధించిన ఎన్నో వ్యాధుల నుండి బయటపడవచ్చు. 
 
పెసరపప్పుతో చారు కాస్తే దాన్ని, పెసరకట్టు అంటారు. చింతపండు కలపకుండా పెసరకట్టు చేసుకుని అన్నంలో కలిపి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలిని కూడా పెంచుతుంది. జ్వరం వచ్చిన వాళ్ళకి పెసరకట్టు చాలా మంచి ఆహారం. వట్టి పెసర కట్టులో నిమ్మరసం గానీ, దానిమ్మరసం గానీ, టమోటారసం గానీ, ఉసిరికాయరసం గానీ కలిపి త్రాగుతుంటే వాతవ్యాధులన్నీ మాయమవుతాయి. 
 
పెసరపప్పు ఒక గ్లాస్, బియ్యం నాలుగు గ్లాసులతో అన్నం తయారుచేస్తే దీన్ని పెసర పులగం అంటారు. ఇలా చేసుకుని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. మొలలు ఉండేవారు రోజూ దీన్ని తినడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. 
 
కడుపులో పుండుని చల్లార్చుతుంది, పేగుపూత, కాళ్ళు, కళ్ళు మంటల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది. కాబట్టి ఇందులో అల్లం, మిరియాలు, నెయ్యి వంటివి కలిపి తింటే సులువుగా జీర్ణమవుతుంది. బియ్యం నాలుగు గ్లాసులు, పెసరపప్పు ఒక గ్లాసు కలిపి జావగా కాచి తాగవచ్చు. జ్వరంతో అన్నం తిననివారికి ఇది మంచి ఆహారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు