మామిడికాయ మంచివాసనే... తింటే పుల్లగా... జాగ్రత్త గురూ కాల్షియం కార్బైడ్ అదే...

శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (15:37 IST)
షరా మామూలుగానే ఓ నిషేధిత పదార్థం చట్టం సరిగా అమలు కానందున మార్కెట్లో విరివిగా దొరుకుతోంది. అధికారులు సుమారు రూ.4,69,400/- జరిమానాని వసూలు చేసారు కానీ అమ్మేవారిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఈ పదార్థం పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. దీన్ని తీసుకున్నవారిలో గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు నాడీవ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
 
కాల్షియం కార్బైడ్... ఓ సర్వే ప్రకారం గత ఐదు సంవత్సరాల కాలంలో 29560 కిలోలు అమ్ముడైంది. ప్రతి వేసవిలో మామిడి పండ్లను కృత్రిమంగా మగ్గపెట్టేందుకు ఉపయోగించే ఈ రసాయన పదార్థం ఒక ప్యాకెట్ రూ.3కే అందుబాటులో ఉంటోంది. తేమతో కలిసిన కార్బైడ్ ఎసిటిలైన్ గ్యాస్‌ను వెలువరుస్తుంది. ఇది క్యాన్సర్‌కు సైతం దారితీస్తుంది. నాడీవ్యవస్థకు హాని చేయడంతో పాటు మెదడుకు ఆక్సిజన్‌ను సక్రమంగా సరఫరా కాకుండా చేస్తుంది. దీని వల్ల తలనొప్పి, మైకం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, డయేరియా, వాంతులు వంటివి ఏర్పడుతాయి.
 
కార్బైడ్ ఉపయోగించి పండ్లను మగ్గపెట్టారని కనుక్కోవడం ఎలా -
కార్బైడ్‌తో కాయలను కేవలం 3 రోజుల్లో మగ్గపెట్టవచ్చు. అలాంటి మామిడి పండ్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆకుపచ్చ రంగులో ఉండే కాయల తోలు మొత్తం ఎక్కడా తేడాల్లేకుండా పసుపుగా ఉంటుంది, కానీ లోపలి రసంలో ఎలాంటి జీవరసాయన మార్పులు జరగవు. సహజంగా మగ్గిన పండ్లు పూర్తిగా పండి ఉంటాయి.
 
లాభార్జనే ధ్యేయంగా కృత్రిమ పద్దతుల్లో పండ్లను మగ్గబెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులను ఇకనైనా ప్రభుత్వం కట్టడి చేయాలని, అధికారులు నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి