కరోనా: మాస్కులు, శానిటైజర్లు ఎంతవరకు అవసరం?

శనివారం, 7 మార్చి 2020 (13:35 IST)
కరోనా ప్రభావంతో మాస్కులకు రెక్కలొచ్చాయి. దీంతో వైద్యాధికారులు స్పందించారు. ఎన్95 మాస్క్ అనేది కరోనా రోగులకు చికిత్స చేసే వైద్యులు, సిబ్బంది, పక్కన వుండే సహాయకులు మాత్రమే ధరించాలని.. సాధారణ  ప్రజలకు దీని అసరం లేదన్నారు. కేవలం జలుబు, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నవారు మాత్రమే మాస్కులు లేదా చేతి రుమాలు, టిష్యూ పేపర్ వాడాలని ఆరోగ్యవంతులకు మాస్కులు అవసరం లేదంటున్నారు. 
 
కరోనా వైరస్ ముక్కుకు మాస్కులు ధరించడం, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం వంటి సూచనల్ని తప్పకుండా పాటిస్తే వైరస్‌ సోకే ప్రమాదాన్ని భారీగా తగ్గించొచ్చని చెబుతున్నారు. దీనికి చక్కటి పరిష్కారం హ్యాండ్‌ శానిటైజర్లు. వీటినైతే ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మనం ఉన్నచోటే చేతుల్ని శుభ్రం చేసుకోవచ్చు. అలా అని శానిటైజర్లు లేనప్పుడు సబ్బుతో చేతుల్ని కడుక్కోవడం మాత్రం మానేయకూడదు.
 
వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో హ్యాండ్‌ శానిటైజర్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. అలాంటి శానిటైజర్లను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. దీనికి కలబంద, రబ్బింగ్‌ ఆల్కహాల్‌గా పిలిచే ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ లేదా ఇథనాల్‌ కావాల్సి ఉంటుంది. రబ్బింగ్‌ ఆల్కహాల్‌, కలబందను బాగా కలిసే వరకు మిశ్రమంగా కలుపుకోవాలి. ఆల్కహాల్‌ వాసన పోయేలా దీనికి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కలుపుకోవచ్చు. దీన్ని ఓ బాటిల్‌లో స్టోర్‌ చేసుకొని శానిటైజర్‌గా వాడుకోవచ్చు. అయితే ఈ మిశ్రమంలో 60శాతం ఆల్కహాల్‌ ఉంటేనే కరోనాను రానీయకుండా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెప్తున్నారు.
 
శానిటైజర్లు అన్నిరకాల వైరస్‌లను చంపవు. అయితే తాజా కరోనా వైరస్‌పై మాత్రం మంచి ప్రభావం చూపుతుందని నిపుణులు తెలిపారు. శానిటైజర్‌లో ఉండే ఆల్కహాల్‌ కరోనాను బలహీనపరుస్తుంది. దీంతో వైరస్‌ చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని వారు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు