ఉబ్బసానికి, తామర వ్యాధికి కుంకుడు కాయ శ్రేష్టం...

గురువారం, 10 నవంబరు 2016 (16:01 IST)
ప్రస్తుతం షాంపులు వచ్చాయి. కానీ ఒకప్పుడు ప్రతి ఇంట్లో కుంకుడు కాయ పులుసుతోనే తలంటుకునే వారు. కుంకుడు కేవలం తలంటు కునేందుకే కాక అద్భుతమైన ఆయుర్వేద విలువలను కలిగి ఉన్నది. అనేక రకాలైన రోగాల్ని నయం చేస్తుంది. నేటికీ పెద్ద వయస్సు ఉన్న వారు ఇళ్లలో ఉంటే వారు కుంకుడు కాయతోనే తలంటుకుంటాడు. పిల్లలైతే కుంకుడు కాయ అంటే ఆమడదూరం పరుగెడతారు. చేదుగా ఉండే కుంకుడు కాయరసం కంట్లో పడిందా ఒళ్ళు తెరవనీయక మంట పుట్టిస్తుంది. అందుకే పిల్లలు దీనికి దూరంగా ఉంటారు.
 
కుంకుడు కాయ చేదుగా ఉంటుంది. దీని రసం నురగతో ఉంటుంది. ఇది క్రిమి సంహారిణిగా ఉపయోగపడుతుంది. కుంకుడు కాయలో ఉండే గింజను బద్దలుకొడితే పప్పు ఉంటుంది. ఇది ఉబ్బసాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. హిస్టీరియా వ్యాధిలో కుంకుడు కాయ పొగను వేసి ఆ పొగను వాసన పీల్చేలా చేస్తే వారు సృహలోకి వస్తారు. హిస్టీరియా రోగికి చితక కొట్టిన కుకుండు కాయను నీటితో పిసికి ఆ రసాన్ని రోగి ముక్కు రంధ్రాలలో ఒకటి లేక రెండేసి చుక్కలు వేస్తే వెంటనే సృహలోకి వస్తారు.
 
కుంకుడు కాయ రసంతతో తలంటు కుంటుంటే చుండ్రు తగ్గి పోతుంది. కురుపులను కుంకుడు కాయ రసంతో కడుగుతూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. చిడుము వ్యాధిలో కుంకుడు అద్భుతంగా పనిచేస్తుంది. తామర వ్యాధిలో ముందుగా తామర వ్యాధి ఉన్న ప్రాంతంలో కుంకుడు కాయరసంతో శుభ్రం చేసి ఆ తర్వాత జిల్లేడు పాలు రాయాలి. 
 
తేలు, జెర్రి కాటులకు కుంకుడు కాయ గుజ్జును ఆ ప్రాంతంలో వ్రాయాలి. బాధపోయేదాకా రుద్దాలి. కుంకుడు కాయల చిక్కటి రసం ఒక్కో ముక్కులో రెండు చుక్కలు వేస్తే ఎంతటి తలనొప్పి అయినా వెంటనే తగ్గిపోతుంది. కుంకుడు ఆకులను తలకు కట్టినా దారుణమైన తలనొప్పి కూడా తగ్గుతుంది. దురదులకు కుంకుడు కాయ రసంతో స్నానం చేయాలి. కుంకుడు కాయల రసం పేళ్ళను చంపేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి