పద్మాసనము ఎలా వేయాలి, ఉపయోగమేంటి?

మంగళవారం, 10 డిశెంబరు 2019 (21:56 IST)
ఆసనాల్లోనే పద్మాసనము చాలా ముఖ్యమైనది. ఎంతో ప్రయోజనమైన ఆసనం అంటున్నారు యోగా గురువులు. ఈ ఆసనం ప్రాణాయామం, ధ్యానం చేయుటకు చాలా ఉపయోగకరమైనదట. కుండలినీ శక్తిని జాగృతము చేసి పైకిలేపడానికి ఈ ఆసనం చాలా ఉపయోగకరమైనదట. కుండలినీ శక్తి శరీరంలోని వెన్నెముక యొక్క క్రింది భాగమున చుట్టుకుని నిద్రపోతున్న సర్పంలా ఉంటుందట. ఈ కనిపించని అంతర్గతముగా ఉన్న శక్తిని మేలుకొలిపి వెన్నెముక ద్వారా పైకి మెదడులోకి శక్తి వెళ్లడంతో అసమానమైన జ్ఞానము కలిగి మానవుడు అనుకున్నది సాధిస్తాడట.
 
ఇంతకీ ఈ ఆసనం ఎలా వేయాలంటే... రెండు కాళ్ళను ముందుకు చాచి దండాసనంలో కూర్చోవాలి. కుడికాలిని మోకలు వద్ద ఉంచి రెండు చేతులతో పాదము తీసుకుని ఎడమ తొడ మొదలయందు కుడి మడమ బొడ్డు దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి. ఎడమ కాలిని మోకాలు వద్ద ఉంచి రెండు చేతులతో పాదములు తీసుకొని కుడి తొడ మొదలు యందు ఎడమ మడమ బొడ్డు దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి. 
 
క్రింద నుంచి మెడ వరకు వెన్నెముక నిటారుగా ఉంచాలి. రెండు చేతులను చాచి ఎడమ చేయి ఎడమ మోకాలి వద్ద కుడి చేయి కుడి మోకాలి వద్ద ఉంచాలి. బొటన వ్రేళ్ళను కలిపి మిగిలిన మూడు వ్రేళ్ళను చాచి ఉంచాలి. లేకుంటే ఒక అరచేయి మీదుగా ఇంకో అరచేయిని రెండు పాదములు ఒక దానిని ఒకటి కలిపిన దగ్గర ఉంచుకోవచ్చు. కాళ్ళ స్థితిని మార్చి అంటే ఎడమ పాదమును కుడి తొడ మీద, కుడిపాదమును ఎడమ తొండ మీద వచ్చునట్లుగా చేయాలి. రెండు కాళ్లు సమానంగా పెట్టాలి.
 
క్రింద కూర్చోవడం అలవాటు లేని వారికి ఈ ఆసనం చేసేటప్పుడు విపరీతమైన నొప్పి మోకాళ్ళ వద్ద కలుగుతుందని యోగా గురువులు చెబుతున్నారు. కానీ నొప్పికి తట్టుకుని శ్రద్థగా సాధన చేసిన నొప్పి క్రమంగా తగ్గిపోయి హాయిగా ఉంటుందట. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. మొదట మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయట. మనస్సు ప్రశాంతంగ ఉండడమే కాకుండా ఉత్సాహాన్ని ఇస్తుందట. జీర్ణవ్యవస్ధ, ఉదర భాగంలోని అవయవాలన్నీ బాగా పనిచేస్తాయంటున్నారు యోగా గురువులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు