శీతాకాలంలో తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? (video)

శనివారం, 21 నవంబరు 2020 (21:22 IST)
ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారం కడుపు నింపడానికి మాత్రమే అనుకోకూడదు. శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు పట్టుకోవడం మామూలే. ఐతే ఇది ఈ కరోనా కాలంలో సాధారణం అనుకోలేం కాబట్టి వాటిని దరిచేరకుండా చూసుకోవాలి.
 
వ్యాధుల నుండి దూరం ఉంచడానికి, శరీరాన్ని లోపలి నుండి బలోపేతం చేయడం అవసరం. రోగనిరోధక శక్తి సహాయంతో వ్యాధులపై పోరాడవచ్చు. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని తీసుకుంటే, చాలా వ్యాధులను చాలా తేలికగా నివారించవచ్చు. కాబట్టి మీ రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి శీతాకాలంలో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
 
శీతాకాలంలో బచ్చలికూర, ఆకుకూరలు, మెంతికూర, కూరగాయలు వంటి ఆకుపచ్చ ఆకు కూరలను మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి మీ శరీరంలో విటమిన్ల లోపాన్ని పూరించడానికి సహాయపడతాయి. వీటితో పాటు, మీ రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.
 
విటమిన్ సి తీసుకోవడం మీకు చాలా ప్రయోజనకరం. నారింజ, ఉసిరి, నిమ్మకాయ వంటి విటమిన్ సి ఉన్న ఆహారాన్ని ఎంచుకోండి. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను మీ ఆహారంలో చేర్చాలి. శీతాకాలంలో రాత్రి పడుకునే ముందు పసుపు పాలను క్రమం తప్పకుండా తీసుకోండి. పసుపు పాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.
 
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి అల్లం మరియు వెల్లుల్లి తినండి. ఇవే కాకుండా నల్ల మిరియాలు, పసుపు కూడా వాడాలి. మీ రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడానికి ఇవి పనిచేస్తాయి. శీతాకాలంలో తక్కువ నీరు తాగుతారు, ఎందుకంటే శీతాకాలంలో దాహం కూడా తక్కువగా ఉంటుంది. అలాగని మంచినీళ్లు తాగకుండా వుండకూడదు. రోజుకి కనీసం 12 గ్లాసుల మంచినీళ్లు తాగాలి. ఇవన్నీ చేస్తే శీతాకాలం సీజన్లో వచ్చే వ్యాధులను అడ్డుకోవచ్చు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు