అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఉదయం పూట గుడ్డు తినడం మంచిదే. అయితే నూనెలో ఫ్రై చేయకుండా ఆరగించవచ్చు. మధ్యాహ్నం, రాత్రి పూట అలా తీసుకోవడం బాగానే ఉంటుంది. ఉదయం తీసుకోవడం వల్ల అధిక శాతం కొలెస్ట్రాల్ శరీరానికి చేరుతుంది. అందుకే ఉడికించిన గుడ్డు తీసుకొంటే చాలునని వారు చెప్తున్నారు.
అల్పాహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. చక్కెర, వెన్నతో చేసినవి పొద్దున్నే తినడం వల్ల శరీరంలోకి ఎక్కువ కెలోరీలు చేరతాయి. వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. వేయించిన బంగాళాదుంపల్నీ అల్పాహారంలో తీసుకుంటే అరుగుదల అంతగా ఉండదు. పొట్టకి ఇబ్బందిని కలిగిస్తుంది.
ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్కి దూరంగా ఉండటం ఉత్తమం. వీలైనంత వరకు తేలిగ్గా జీర్ణమయ్యే అల్పాహారం తీసుకోవడం మంచిది. తాజా పండ్ల రసాలు గ్లాసుడు అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.