పచ్చికూరగాయ ముక్కలను తినడం వలన లాభాలేమిటి?

శనివారం, 30 జూన్ 2018 (21:44 IST)
ఈ రోజులలో చాలామంది పిల్లలు పోషకాహారలోపం వలన రకరకాల అనారోగ్యాలకు గురి అవుతున్నారు. దీనికి కారణం వారికి ఆహారం గురించి సరైన అవగాహన లేకపోవడమే. తాజా పండ్లు, కూరగాయలు తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పిల్లలకు అర్థమయ్యే రీతిన చెప్పడం వలన వారికి ఆహారం పట్ల సరైన అవగాహన ఏర్పడి అన్ని రకాల పదార్థాలను తీసుకోవటానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. అంతేకాకుండా పిల్లలకు వారు తినే ఆహారం చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా పండ్లను రకరకాల ఆకారాలలో కట్ చేసి వారు ఇష్టంగా తినేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకు టమోటా, దోస, క్యారెట్ లాంటి పచ్చి కూరగాయముక్కలను తినటం అలవాటు చేయాలి.
 
ఇలా పచ్చికూరగాయ ముక్కలను తినడం వలన పిల్లలకు చాలా రకాల విటమిన్లు, ప్రోటీన్లు అందుతాయి. ఇవి పిల్లల శారీరక, మానసిక పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయి. పిల్లలు ఏవయినా ఇంట్లో అమ్మానాన్నల నుంచే నేర్చుకుంటారు. కాబట్టి ముందు మీరు పోషకాహారం తీసుకునే విషయంలో పిల్లలకు ఆదర్శంగా ఉండండి. ఫ్రిజ్‌లో పిల్లలకు కనిపించకుండా శీతలపానీయాలు దాచిపెట్టి వాళ్లు లేనప్పుడు తాగడం. మేం పెద్దవాళ్లం కాబట్టి ఏదైనా తినొచ్చు అనే వంకతో వాళ్ల ఎదురుగానే జంక్‌పుడ్ లేదా నూనె ఎక్కువుగా వేసిన పదార్థాలు తీసుకోవడం మానేయాలి. 
 
మీరు పోషకాహారం తింటూ వాటివల్ల ఉపయోగాలు గురించి చెబుతుంటే పిల్లలు కూడా అనుసరిస్తారు. ఒకేసారి పూర్తిగా జంక్‌పుడ్‌ని మాన్పించడం వల్ల వారు మామూలు ఆహారం తిననని మారాం చేస్తారు. అందుకని మెుదట్లో వారానికోసారి తినిపించి తర్వాత క్రమంగా ఆ అలవాటును మాన్పించాలి. దీనివలన పిల్లల ఎదుగుదల, బరువులో తేడాను స్పష్టంగా గమనించవచ్చు. ఇలా ఇంట్లో వండేవి తినాలంటే పిల్లల్ని కూడా వంటల్లో భాగస్వాముల్ని  చేయాలి. వారు చేసేవి చిన్న పనులు అయినప్పటికి వారు మేమే చేసామని తృప్తితో తింటారు. వారి చేత పెరట్లో కొత్తిమీర, కరవేపాకు, మెంతికూర లాంటి మెుక్కలను నాటించాలి. అప్పుడు వారు పెంచిన కూరగాయల్ని తినటానికి వాళ్లు ఎక్కువ ఇష్టపడతారు. దీనివలన పిల్లలకు మంచి ఆరోగ్యం, ఆహారంపై సరియైన అవగాహన ఏర్పడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు