టైపింగ్ పనిచేసేవారు ''మకరాసనం'' వేస్తే...

మంగళవారం, 19 జూన్ 2018 (11:47 IST)
మెడనొప్పులతో బాధపడేవారు మకరాసనం వేయడం వలన ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా టైప్ ఇనిస్టిట్యూట్‌లలో పనిచేసేవారు, ప్రెస్ కంపోజింగ్ పనిలో ఉండేవారు, కంప్యూటర్ ఆపరేటర్లు, లెక్కలు రాసేవారు, పుస్తకాలు చదివేవారు ఎక్కువగా మెడనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటివారు రాత్రి భోజనానికి ముందుగా ఈ మకరాసనం వేయడమ మంచిది.
 
మకరాసనం అనగా ముందుగా మకరం అంటే మెుసలి అని అర్థం, ఆసనం అనగా మెుసలి రూపంలో ఉంటుంది. దీనికి నిరాలంబాసనం అనే మరో పేరు కూడా ఉంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే ముందుగా బోర్లా పడుకుని భుజంగాసనంలాగా వేయాలి. రెండు చేతులను చుబుకం కింద ఆనించి, బుగ్గలను ఒత్తుతూ ఉండాలి. అలాగే రెండు మోచేతులను జోడించి నేలపై ఉంచి శ్వాసను సామాన్యంగా పీలుస్తూ, కళ్లు మూసుకుని, మెడమీద మనస్సును నిలపాలి.
 
అలా రెండు నిమిషాల తరువాత తలను కిందికి దించి మోకాళ్లను చాపి ఉంచాలి. తరువాత శరీరం బరువునంతటినీ భూమిమీద పడేసి కళ్లు మూసుకోవాలి. అన్ని ఇంద్రియాలను మరచిపోయి కాసేపు అలాగే పడుకోవాలి. ఇలా చేయడం వల్ల మనస్సు శాంతపడుతుంది. శరీరమంతా శీతలీకరణం చెందుతుంది.
 
ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే అధిక రక్తపోటుతో భాదపడుతున్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆసనాన్ని వేయకూడదు. మిగిలినవారు ప్రతిరోజూ ఈ ఆసనాన్ని వేయడం వలన మెడనొప్పుల నుంచి సాధ్యమైనంత దూరంగా ఉండవచ్చును.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు