#GitaJayanti : పరమాత్మతత్వాన్ని బోధించిన రోజు

గురువారం, 30 నవంబరు 2017 (09:23 IST)
నేడు (నవంబరు 30వ తేదీ) గీతాజయంతి. భగవద్గీత మానవాళికి అందిన రోజు. సాక్షాత్ శ్రీకృష్ణుడే గురువుగా మారి.. అర్జునుడికి జీవన సత్యాలను… పరమాత్మ తత్వాన్ని బోధిస్తూ, వివరించిన రోజు. హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజును… ప్రపంచవ్యాప్తంగా గీతాజయంతిగా జరుపుకుంటారు.
 
"గీకారం త్యాగరూపం స్యాత్
తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం
జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:"
 
గీత అను రెండక్షరములు సర్వసంగపరిత్యాగానికి.. ఆత్మసాక్షాత్కారానికి ప్రతీకలు. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశిస్తుంది. అటువంటి పరమపావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈ రోజు (గురువారం) ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించినా మహాపుణ్యం వస్తుందని హిందువుల నమ్మకం. ఇక చదివితే కలిగే ఆనందం.. అంతాఇంతా కాదు. మానవాళి సర్వ సమస్యలకు పరిష్కారానికి మార్గం సూచిస్తుంది. 
 
"యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహమ్"
 
ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మమూ క్షీణించి, అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో, అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ వుంటాను.
 
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే"
 
సాధు, సజ్జనులను సంరక్షించటం కోసం, దుర్మార్గులను వినాశం చేయడానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. 
 
అంటూ పరమాత్మ శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. సత్యాన్ని, ధర్మాన్ని పరిరక్షిస్తూ… అందరి శ్రేయస్సును కోరుకోమని చెబుతోంది గీత. ఆ మార్గాన్ని అనుసరిస్తే జీవితం సాఫల్యమైనట్టే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు