నాగపంచమి రోజున నాగేంద్రునికి నైవేద్యంగా ఏం పెట్టాలో తలుసా?

శుక్రవారం, 3 ఆగస్టు 2018 (17:08 IST)
శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమి అని అంటారు. ఇది ఈ నెల ఆగస్టు 15న వస్తుంది. ఈ రోజున చేసే నాగపూజలు విశేషమైన ఫలితాలను అందిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాల్లో చెప్పబడుతోంది. నాగుల చవితి మరుసటి రోజున వచ్చే నాగపంచమి రోజున వెండితోగానీ, మట్టితో గానీ నాగ ప్రతిమను తయారుచేసుకుని పంచామృతాలతో అభిషేకం చేస్తే మంచిదని శాస్త్రంలో తెలియజేశారు.
 
నాగేంద్రస్వామి సన్నిధిలో మట్టి ప్రమిదులు ఉంచి నువ్వుల నూనెతో ఏడు ఒత్తులను వెలిగించాలి. ఈ రోజున దీపారాధనకి నువ్వుల నూనెను ఉపయోగించడం అత్యంత శ్రేష్టమైనదని చెప్పబడుతోంది. అంతేకాకుండా భక్తిశ్రద్ధలతో నాగ సంబంధమైన స్తోత్రాలు చదువుతూ సుగంధభరితమైన పువ్వులను కూడా సమర్పించాలి. ఆ స్వామికి ఇష్టమైన చలిమిడి, వడపప్పు, అరటిపండ్లను నైవేద్యంగా పెట్టాలి. 
 
ఈ నాగపంచమి రోజున పుట్టలో పాలుపోసి నాగేంద్రస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. అలానే ఉపవాస దీక్షను చేపట్టాలి. అలాకాకుంటే నూనె తగలని పదార్థాలను మాత్రమే స్వీకరించాలనే నియమాన్ని తప్పకుండా పాటించాలి. ఈ విధంగా నాగపంచమి రోజున నాగేంద్రుడిని పూజించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రంలో స్పష్టం చేయబడుతోంది. అంతేకాకుండా వివాహ యోగం, సంతాన భాగ్యం, సౌభాగ్య సిద్ధి కలుగుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు