జియో ఆల్ట్రా హైస్పీడ్ ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌ బ్యాండ్ సేవల టారిఫ్ లీక్...

శుక్రవారం, 3 ఆగస్టు 2018 (14:34 IST)
జియో ఆల్ట్రా హైస్పీడ్ ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌ బ్యాండ్ సేవల టారిఫ్ ఇపుడు ఆన్‌లైన్‌లో లీకైంది. ఇది దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనంగా మారింది. నిజానికి దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన తర్వాత ధరలు ఒక్కసారిగా తగ్గిపోయిన విషయం తెల్సిందే. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ టెలికాం కంపెనీలు ధరలను తగ్గించాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది.
 
ఈ నేపథ్యంలో ఆల్ట్రా హైస్పీడ్ ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌ బ్యాండ్ సేవలను అందుబాటులోకి జియో తీసుకునిరానుంది. ఈ సేవల కోసం ఆగస్టు 15 నుంచి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పిన తరుణంలో టారిఫ్ ప్లాన్లు ఆన్‌లైన్లో లీక్ అయ్యాయి. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం, 50 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్‌తో నెలకు 300 జీబీ వాడుకునేందుకు రూ.500 చెల్లించాల్సి వుంటుంది. 
 
అదే 450 జీబీకైతే రూ.750 చెల్లించాలి. ఇక 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 600 జీబీ కావాలంటే రూ.999, 750 జీబీ కావాలంటే రూ.1,299 చెల్లించేలా ప్లాన్స్ రూపొందించినట్టు తెలుస్తోంది. 150 ఎంబీపీఎస్ స్పీడ్ కావాలని కోరుకుంటే నెలకు 900 జీబీ డేటా కోసం రూ.1,500 చెల్లించాలని సంస్థ నిర్ణయించిందన్న వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ లీకైన టారిఫ్‌ రేట్లపై జియో యంత్రాంగం అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆగస్టు 15వ తేదీ వరకు వేచివుండాల్సి ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు