జలుబు చేసిందా.. అయితే ఇది తినండి...

గురువారం, 22 జూన్ 2017 (12:25 IST)
వాము లేదా వామ్ము.. కేవలం వంటల్లోనే కాదు అనారోగ్యాలను తరిమి కొట్టడంలోనూ వాము ఉపయోగపడుతుంది. వాము వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, సువాసన వస్తుంది. అలాగే, ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది. వాటిని ఓసారి పరిశీలిద్ధాం. 
 
సాధారణంగా సీజన్ మారిందంటే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త వాతావరణం చాలా మందికి పడక జలుబు చేస్తుంది. దీన్ని వాముతో తగ్గించుకోవచ్చు. వామును ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా నలపాలి. అనంతరం ఆ పొడిని శుభ్రమైన వస్త్రంలో కట్టి దాన్ని వాసన పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తే జలుబు వెంటనే తగ్గుతుంది. 
 
ఒక టీస్పూన్ వామును ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని రోజూ తాగుతూ ఉంటే కిడ్నీలో రాళ్ల కరుగుతాయి. మూత్రాశయ సమస్యలు పోయి మూత్రం ధారాళంగా వస్తుంది. 
 
ఒక టీస్పూన్ వాము, ధనియాలు, జీలకర్రలను తీసుకుని మూడింటినీ కలిపి పెనంపై దోరగా వేయించాలి. అనంతరం ఆ మిశ్రమంతో కషాయం తయారు చేసుకోవాలి. దీన్ని తాగుతుంటే జ్వరం తగ్గుతుంది. 
 
వామును ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని బుగ్గన పెట్టుకుని నములుతూ వచ్చే రసాన్ని కొద్ది కొద్దిగా మింగాలి. దీంతో గొంతు నొప్పి తగ్గుతుంది. ఒక టీస్పూన్ మోతాదులో వామును తీసుకుని దానికి కొద్దిగా బెల్లం కలపాలి. ఆ మిశ్రమాన్ని సేవిస్తే ఆస్తమా తగ్గుతుంది. 
 
వామును నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో ఏదో ఒక రూపంలో తింటున్నా గుండె వ్యాధులు రాకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కడుపులో అసౌకర్యంగా ఉంటే కొద్దిగా వామును తినాలి. దీంతో జీర్ణాశయం సరిగ్గా పనిచేస్తుంది. ఆకలి బాగా పెరుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి