ఇష్టరాజ్యంగా రెస్టారెంట్ల పనితీరు

FileFILE
కాలంతో పాటు మానవుని జీవన స్థితిగతులు, ప్రమాణాలు వేగంగా మారిపోతున్నాయి. ఉదయం ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి రాత్రి ఇంటికి చేరుకునేంత వరకు సగటు జీవి నానా కష్టాలు పడుతున్నాడు. ఈ కష్టాల్లో తాము సేవిస్తున్న నీరు, తింటున్న ఆహార పదార్ధాలపై పెద్దగా శ్రద్ధ చూపించలేక పోతున్నాడు. భోజన వేళకు వేడివేడి ఆహారపదార్ధాలు ఎక్కడ లభ్యమవుతాయో అక్కడే కడుపు నింపుకుంటున్నాడు.

అయితే తాము తీసుకునే ఆహార పదార్ధాలు ఎంత శాతం మేరకు పరిశుభ్రమైనవి అనే అంశాన్ని ఎవరూ ఆలోచించడం లేదు. అంతేకాకుండా అవి ఎన్ని రోజులకు సంబంధించినవి అనేది కూడా పట్టించుకోవడం లేదు. దీన్ని ఆసరాగా తీసుకున్న రెస్టారెంట్లు, హోటల్స్ నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉన్న ఆహార పదార్ధాలు, మాంసం వంటివి వేడి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నారు.

రుచికరంగా, వేడివేడిగా ఉండటంతో కస్టమర్లు శుభ్రంగా ఆరగిస్తున్నారు. అయితే ఎపుడో ఒకరోజున అనారోగ్యానికి గురైన తర్వాత గానీ వారికి అసలు విషయాన్ని తెలుసుకోలేక పోతున్నారు. అంతేకాకుండా.. 'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల'న్న చందంగా హోటల్, రెస్టారెంట్ల యజమానులు కూడా ఏమాత్రం భద్రతా ప్రమాణాలను పాటించకుండా ఇష్టానుసారంగా ఆహారపదార్ధాలు తయారు చేస్తున్నారు. చివరకు వంటగదులు, వంట పాత్రలు సైతం పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదు. వీటిపై ప్రభుత్వ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి వుంటుంది.

వెబ్దునియా పై చదవండి