కారంగా... పుల్లగా... మామిడి చికెన్ కర్రీ

బుధవారం, 28 మే 2008 (15:11 IST)
పచ్చి మామిడి కాయల్ని చికెన్‌తో కలిపి కర్రీగా తయారుచేస్తే ఆ రుచే వేరు. ఘాటైన మసాలతో చికిన్ ముక్క నములుతున్నప్పుడు మధ్యలో పుల్ల పుల్లగా మామిడి రుచి తోడైతే భలే బాగుంటుంది. ఇలా తయారుచేసిన కూరను అన్నంతో కలిపి ఆరగిస్తే ఇక ఆ భోజనం పసందు అని చెప్పవచ్చు. అందుకే మామిడికాయల్ని కలిపి చేసే చికెన్ కర్రీ తయారీ గురించి తెలుసుకుందాం.

దీని తయారీకి కావల్సినవి : ఎముకలులేని చికెన్ 1కేజీ, పచ్చిమామిడి కాయలు పావుకిలో, అల్లం పేస్ట్ ఒకచెంచా, వెల్లుల్లి పేస్ట్ కొంచెం, నువ్వులనూనె, లవంగాలు నాలుగు, ధనియాల పొడి టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తగినంత, మెంతిపొడి టీస్పూన్, గరం మసాల తగినంత, ఉప్పు తగినంత, గసగసాలు 50 గ్రాములు.

తయారు చేసే విధానం : చికెన్‌ను తగినంత సైజులో ముక్కలుగా కోసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చిని సన్నముక్కలుగా తరుక్కోవాలి. మామిడిని బాగా సన్నగా కోరుకోవాలి. మసాలా దినుసుల్ని మిక్సీలో వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యిపై బాణలి పెట్టి దానిలో నూనెపోయాలి.

నూనె బాగా కాగాక అందులో లవంగాలను వేయించి మసాలా పేస్ట్‌ను వేసి వేగించాలి. తర్వాత కారంపొడి, ధనియాలపొడి వేసి వేగనివ్వాలి. అనంతరం చికెన్ వేసి సన్నటి మంటపై ఉడకనివ్వాలి.

ఈ సమయంలో కూరకు తగినంత ఉప్పు వేయాలి. చికెన్ మెత్తగా ఉడకగానే అందులో మామడి కోరును కలపాలి. కొంతసేపు తర్వాత మెంతిపొడి, గరం మసాలాపొడి, కొత్తిమీర కలిపి దించేయాలి.

వెబ్దునియా పై చదవండి