రుచికరమైన చిక్కుడుకాయ కూర

చిక్కుడుకాయల్లో మంచి పోషకాలు ఉన్నట్టు న్యూట్రిషన్లు చెబుతుంటారు. అందుకే చిక్కుడు కాయల్ని 'పేదవాని మాంసం'గా అభివర్ణిస్తుంటారు. అలాంటి చిక్కుడు కాయలతో వివిధ రకాలైన వంటకాలను సులభంగా తయారు చేయవచ్చు.

చిక్కుడు కాయలతో చేసే ప్రతివంటకం అత్యంత రుచికరంగా ఉండి శరీరానికి కావల్సిన వివిధ పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. అందుకే ఇప్పుడు చిక్కుడు కాయలతో చేయదగిన ఓ వేపుడు గురించి తెలుసుకుందాం.

ఇందుకు కావల్సినవి : చిక్కుడుకాయలు- పావు కేజీ, నూనె- ఆరు చెంచాలు, చింతపండు గుజ్జు, మిరపకాయలు, ధనియాలు, సెనగపప్పు, మినపప్పు, మెంతులు, జీలకర్ర, ఎండుకొబ్బరి ఇవన్నీ దాదాపు రుచికి సరిపోయే క్రమంలో కొంచెం అటూ ఇటుగా తీసుకోవాలి.

కూర తయారు చేయడం : స్టవ్ మంటపై బాణలి పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత మిరపకాయలు, సెనగపప్పు, ధనియాలు వేయాలి. అవి కాస్త వేగిన తర్వాత మిగిలిన మసాలా దినుసులను సైతం వేసి ఎర్రగా వేయించి దించేయాలి.

బాణలిలోని పోపును వేరుగా పెట్టుకుని అందులోనే నూనె వేసి చిక్కుడు కాయ ముక్కల్ని వేసి ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి సన్నని మంటపై పెట్టాలి. తర్వాత వేయించి తీసిన మసాల దినుసుల్ని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. దీనికి కొబ్బరిని సైతం కలపాలి. అనంతరం ఈ పొడిని వేరుగా పెట్టుకోవాలి.

చిక్కుడు కాయ ముక్కలు ముప్పావు వంతు ఉడికిన తర్వాత అందులో పొడిచేసిన మసాల పొడిని వేసి, కలబెట్టి దానికి చింతపండు గుజ్జుని కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నీరు పోసి మంటపై ఉడికించాలి. మెత్తాగా ఉడికిన తర్వాత దించేస్తే రుచికరమైన చిక్కుడు కాయ కూర రెడీ. దీనిని అన్నంలోకి నంజుకుంటే చాలా బాగుంటుంది.

వెబ్దునియా పై చదవండి