ఇండియన్‌వెల్స్ టోర్నీకి విలియమ్స్ సిస్టర్స్ నో

శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (12:56 IST)
ఇండియన్‌వెల్స్ టోర్నీలో ఆడేందుకు అమెరికా టెన్సిస్ తారలు సెరీనా విలియమ్స్, వీనస్ విలియమ్స్‌లు ససేమిరా అంటున్నారు. డబ్ల్యూటీఏ తమపై చర్య తీసుకున్న సరే తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేమంటూ వారు తేల్చిచెబుతున్నారు.

ఈ విషయమై సెరీనా మాట్లాడుతూ తమపై నిషేధం ఉన్నా లేకున్నా టోర్నీలో ఆడబోనని తేల్చేసింది. అలాగే వీనస్ మాట్లాడుతూ టోర్నీలో ఆడాలా వద్దా అన్న విషయంలో క్రీడాకారిణులకు స్వేచ్ఛ ఉండాలని పేర్కొంది. టోర్నీల అభివృద్ధి కోసం డబ్ల్యూటీఏ ఇటీవల కొత్తగా కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టింది.

దీని ప్రకారం 2009లో టాప్-10లో నిలిచే క్రీడాకారిణులు డబ్ల్యూటీఏ చెప్పే పది టోర్నీలో తప్పక పాల్గొనాలి. ఏదేనీ కారణాల వల్ల వాళ్లు పాల్గొనలేకపోతే టోర్నీ జరిగే సమయంలో మూడు రోజుల పాటు టోర్నీ ప్రచారంలో పాల్గొనాలి. ఈ నిబంధనలు పాటించని క్రీడాకారిణులు డబ్ల్యూటీఏ విధించే నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలా డబ్ల్యూటీఏ ప్రవేశపెట్టిన నిబంధనల వల్ల విలియమ్స్ సోదరీమణులకు చిక్కొచ్చిపడింది. గతంలో ఇండియన్‌వెల్స్ టోర్నీ సందర్భంగా తమకు ఎదురైన పరాభవాన్ని మర్చిపోని విలియమ్స్ సోదరీమణులు అప్పటినుంచి ఆ టోర్నీకి డుమ్మా కొడుతూ వస్తున్నారు.

అయితే డబ్ల్యూటీఏ కొత్త నిబంధలనల వల్ల 2009లో జరిగే ఇండియన్‌వెల్స్ టోర్నీలో వీరు తప్పక పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇండియన్‌వెల్స్ టోర్నీపై విలియమ్స్ సోదరీమణులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి