తీవ్రవాదుల ఏరివేత కోసం అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు సాగిస్తున్న పోరులో అమెరికాకు చెందిన ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్గన్లోని సూరిస్థాన్ రాష్ట్రంలో తీవ్రవాదులు ఆదివారం చేసిన దాడిలో వీరు మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతంలోని పర్వత ప్రాంతంలో ఉన్న చెక్పోస్ట్పై వందలాది మంది తాలిబన్ తీవ్రవాదులు ఒక్కసారి దాడి చేశారు.
తీవ్రవాదుల దాడిని తిప్పికొట్టేందుకు అంతర్జాతీయ భద్రతా సహకార సైన్యంతో పాటు.. ఆఫ్గన్ జాతీయ భద్రతా సిబ్బంది ఎదురుదాడికి పాల్పడ్డారు. కొన్ని గంటల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు ఆఫ్గన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలావుండగా, తాము చేసిన దాడిలో 30 మంది సైనికులు, మరికొంతమంది ఆఫ్గన్ సైనికులు మృత్యువాత పడినట్టు తాలిబన్ తీవ్రవాద ప్రతినిధి మరో ప్రకటనలో తెలిపారు.