ఆఫ్ఘన్‌లో బాంబు దాడులు: 21 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో చారిత్రాత్మక అధ్యక్ష ఎన్నికలు జరగడానికి రెండు రోజులు ముందు ఆ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా ఉన్న తాలిబాన్ తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. తాలిబాన్ తీవ్రవాదులు మంగళవారం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 21 మంది పౌరులు మృతి చెందారు. అంతేకాకుండా ఏకంగా దేశాధ్యక్ష భవనంపై తీవ్రవాదులు రాకెట్ దాడి చేశారు.

కాబూల్‌లోని అధ్యక్ష భవనం ప్రాంగణంలోకి తీవ్రవాదులు పేల్చిన రాకెట్ చొచ్చుకొచ్చింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదు. కొంతమేర ఆస్తి నష్టం జరిగింది. సుమారు 17 మిలియన్ల మంది ఆఫ్ఘనిస్థాన్ ఓటర్లు పాల్గొనే అధ్యక్ష ఎన్నికల భద్రతపై కూడా తాజా దాడులతో ఆందోళన వ్యక్తమవుతోంది. తాలిబాన్ తీవ్రవాదులు ఇప్పటికే అధ్యక్ష ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. అయితే అధికారిక యంత్రాంగం నాటో దళాల అండగా ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని గట్టిపట్టు ప్రదర్శిస్తోంది. దేశంలో ఎన్నికలకు ముందుగా తీవ్రవాద దాడులు పెరిగినప్పటికీ, పోలింగ్ బూత్‌ల వద్ద భద్రత పటిష్టంగా ఉందని నాటో దళాల నాయకత్వం కూడా చెబుతోంది.

దేశంలోని మొత్తం పోలింగ్ కేంద్రాల్లో ఒక శాతానికన్నా తక్కువ కేంద్రాలకు మాత్రమే తీవ్రవాద ముప్పు పొంచివుందని నాటో దళాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే ఆత్మాహుతి దళ సభ్యుడొకరు కారు బాంబుతో మంగళవారం నాటో దళాల కాన్వాయ్‌ను ఢీకొట్టాడు. ఈ దాడిలో 10 మంది పౌరులు మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో నాటో సైనికుడొకరు కూడా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి