ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయులకు భద్రత కాల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికి కూడా ఆ దేశంలో మనవారిపై దాడులు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఇటీవల కాలంలో భారతీయులపై వరుసగా జాత్యహంకార దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి దాడులను ఉపేక్షించబోమని, భారతీయలకు భద్రత కల్పిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అయితే తాజాగా మరో భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. హర్యానాకు చెందిన ఓ విద్యార్థిపై శుక్రవారం మెల్బోర్న్లో కొందరు యువకులు దాడి చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతీయులపై జరిగిన పదో దాడి ఇది. హర్యానాకు చెందిన అమృత్ పాల్ సింగ్ అనే 20 ఏళ్ల యువకుడిపై తాజా దాడి జరిగింది. నగరంలోని కాప్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో అమృత్ కమ్యూనిటీ వెల్ఫేర్ కోర్సు చదువుతున్నాడు.
అతడిపై కళాశాలకు సమీపంలోని మెక్డొనాల్డ్స్ అవుట్లెట్ వద్ద యువకులు దాడి చేశారు. పార్ట్టైమ్ ఉద్యోగం చేసే ప్రదేశానికి నడిచి వెళుతున్న తన వద్ద నుంచి ఓ వ్యక్తి మొబైల్ను బలవంతంగా తీసుకున్నాడని అమృత్ తెలిపాడు. తన మొబైల్ తిరిగి ఇవ్వాలని అడిగా. వెంటనే నా ముఖంపై కొట్టాడు. నేను కూడా తిరగబడ్డాను.
ఆపై ఆ యువకుడు, అతని నలుగురు స్నేహితులు తనపై దాడి చేశారని అమృత్ పాల్ సింగ్ తెలిపాడు. జరిగిన విషయాన్ని తాను పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లాలని వెల్లడించాడు. దాడి చేసిన వ్యక్తుల్లో ఒకరు కత్తిని కూడా తీసుకున్నాడని, అయితే అది తన బ్యాగుకు తగలడంతో తప్పించుకున్నానని అమృత్ చెప్పాడు.