మహమౌద్ అహ్మదీనెజాద్ ఇరాన్ అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. నెలక్రితం ఇరాన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ 64 శాతం ఓట్లతో అఖండ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో విజయం ద్వారా దేశాధ్యక్ష పదవిని రెండోసారి స్వీకరించేందుకు నెజాద్ మార్గం సుగమం చేసుకున్నారు.
ఇరాన్ పార్లమెంట్లో బుధవారం జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అహ్మదీనెజాద్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇరాన్ రాజ్యాంగాన్ని, ప్రాంటియర్లను రక్షిస్తానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఇదిలా ఉంటే నెజాద్ రెండోసారి అధ్యక్ష ఎన్నిక అక్రమ మార్గంలో జరిగిందని ఆయన ప్రత్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
జూన్ 12న జరిగిన ఇరాన్ తాజా అధ్యక్ష ఎన్నికల్లో నెజాద్ భారీ ఎత్తున రిగ్గింగ్ చేసి గెలిచారని ప్రత్యర్థులు ఫలితాలు వెలువడిన అనంతరం ఆందోళనకు దిగారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన హింసాత్మక ఆందోళనలో సుమారు 30 మంది ఆందోళనకారులు మృతి చెందారు. నెజాద్ ప్రమాణస్వీకారానికి నిరసన తెలిపేందుకు ప్రతిపక్ష గ్రూపులు బుధవారం నిరసన ప్రదర్శలకు పిలుపునిచ్చాయి.
అధ్యక్ష ప్రమాణస్వీకారం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసేందుకు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అధికారిక యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. పార్లమెంట్ పరిసరాల్లో వందలాది మంది పోలీసులను మోహరించారు. అంతేకాకుండా దీనికి సమీపంలోని సబ్వే స్టేషన్ను కూడా మూసివేశారు.