ఎన్నికలను తాలిబాన్లు అడ్డుకోలేరు: కర్జాయ్

తాలిబాన్ తీవ్రవాదులు గురువారం దేశంలో జరగబోతున్న చారిత్రాత్మక అధ్యక్ష, ప్రావీన్స్ మండలి ఎన్నికలను అడ్డుకోలేరని ఆ దేశ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ నమ్మకం వ్యక్తం చేశారు. మరికొన్ని గంటల్లో ఎన్నికలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కర్జాయ్ మాట్లాడుతూ.. దేశంలో స్థిరత్వం కోసం రేపు జరిగే ఎన్నికల్లో లక్షలాది మంది ఆఫ్ఘన్ పౌరులు ఎన్నికల్లో భాగస్వాములు అవతారని నమ్మకం వ్యక్తం చేశారు.

దేశాభివృద్ధికి, శాంతికి, సుస్థిరతకు ఈ ఎన్నికలు కీలకమని కర్జాయ్ బుధవారం రాత్రి జరిగిన ఓ చిన్న వేడుకలో పేర్కొన్నారు. మన శత్రువులు (తాలిబాన్ తీవ్రావాదులు) ఈ ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసినా, వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరని కర్జాయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే దేశ రాజధాని కాబూల్‌లో కొందరు తీవ్రవాదులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి.

సెంట్రల్ కాబూల్‌లోని ఓ బ్యాంకు భవనంలోకి చొరబడిన తీవ్రవాదులతో భద్రతా సిబ్బంది కొన్ని గంటలపాటు పోరాడారు. చివరకు ముగ్గురు తీవ్రవాదులను హతమార్చారు. దేశ రాజధానిలో తాము వ్యూహారచన చేసిన అనేక దాడుల్లో ఇది కూడా ఒకటని తాలిబాన్ ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్థాన్‌లో గురువారం జరగబోతున్న చారిత్రాత్మక అధ్యక్ష, ప్రావీన్స్ మండలి ఎన్నికలను ఆ దేశ భద్రతా యంత్రాంగం, వారికి అండగా ఉన్న లక్షకుపైగా నాటో సైనికులు ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో తాలిబాన్లకు గట్టిపట్టు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నాటో కమాండర్లు మాత్రం దేశంలో ఒక శాతానికికన్నా తక్కువ పోలింగ్ కేంద్రాలకు మాత్రమే తాలిబాన్ల ముప్పు ఉంటుందని చెబుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో వచ్చే ఏడాది చివరినాటికి తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలని అమెరికా పెట్టుకున్న లక్ష్యానికి ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఆఫ్ఘన్‌లో ఈ లక్ష్య సాధనకు రాజకీయ స్థిరత్వం ముఖ్యమని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి