పాకిస్థాన్లోని సమస్యాత్మక నార్త్వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్ గిరిజన ప్రాంతంలో తాలిబాన్ తీవ్రవాదులు 400 మంది విద్యార్థులు, సిబ్బంది, బంధువులను బందీలుగా ఉంచున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ బాలుర పాఠశాల నుంచి ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న వీరిని తాలిబాన్ తీవ్రవాదులు నిర్బంధించారు.
రాకెట్లు, గ్రెనెడ్లు, అధునాతన ఆయుధాలు కలిగిన తాలిబాన్లతో బందీలను విడిపించేందుకు పోలీసులు మతపెద్దలు ద్వారా చర్చలు జరుపుతున్నారు. ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలోని బక్కా ఖేల్లో తాలిబాన్లు సుమారు 500 మందిని బందీలుగు ఉంచుకున్నట్లు ప్రధానమంత్రి సలహాదారు మీర్జా మొహమ్మద్ జీహాది వెల్లడించారు.
స్వాత్ లోయ, దాని పరిసర ప్రాంతాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు కొన్ని వారాల క్రితం పాక్ ప్రభుత్వం సైనిక చర్య చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో తమపై జరుగుతున్న సైనిక దాడులకు ప్రతిగా తాలిబాన్లు కూడా అనేక ప్రదేశాల్లో బాంబు దాడులు చేస్తున్నారు. తాజాగా వందలాది మందిని బందీలుగా ఉంచుకున్నారు.