తీవ్రవాద ముప్పుపై సమాచారం అందించండి: పాక్

పాకిస్థాన్‌లోని తీవ్రవాద సంస్థలు తమ దేశంలో మళ్లీ దాడులు చేసేందుకు కుట్రపన్నుతున్నాయని భారత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ఆ దేశ ప్రభుత్వం స్పందించింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మమమూద్ ఖురేషి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. భారత ప్రధాని తమ దేశానికి పాక్ తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలను తాము తేలిగ్గా తీసుకోలేమన్నారు.

భారత్‌కు తీవ్రవాద ముప్పు ఉంటే, దీనికి సంబంధించిన సమాచారాన్న తమతో పంచుకోవాలని కోరారు. తమ దేశంలో తీవ్రవాద గ్రూపులు భారత్‌పై మళ్లీ తీవ్రవాద దాడులకు కుట్రపన్నుతున్నాయని మన్మోహన్ సింగ్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని ప్రకటనను తాము తేలిగ్గా తేసుకోలేమని, దీనిని తాము తీవ్రంగానే పరిగణిస్తున్నామని ఖురేషి తెలిపారు.

భారత్‌తో తాము సహకరించాలనుకుంటున్నాము. తాజా తీవ్రవాద ముప్పుకు సంబంధించిన సమాచారన్ని భారత ప్రభుత్వం తమతో పంచుకోవాలని ఖురేషి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ సోమవారం పాకిస్థాన్‌లో తీవ్రవాద సంస్థలు భారత్‌పై తాజా దాడులకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి శశి థరూర్ కూడా పాకిస్థాన్ తీవ్రవాద గ్రూపుల నుంచి వాస్తవ, విశ్వసనీయ ముప్పు పొంచివుందని వ్యాఖ్యానించారు. భారత్‌పై మరోసారి దాడులు జరగకుండా పాకిస్థాన్ ప్రభుత్వం అక్కడి తీవ్రవాద గ్రూపులను అన్నిరకాలుగా అడ్డుకుంటుందని తాము భావిస్తున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి