శ్రీలంక యుద్ధంలో 5000 మంది పౌరుల మృతి

శ్రీలంకలో వేర్పాటువాద ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థను అణిచివేసేందుకు ప్రభుత్వ దళాలు జరిపిన యుద్ధంలో ఐదు వేల మంది పౌరులు మృతి చెందారు. ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ దళాలు చేపట్టిన చివరి దశ సైనిక చర్యలో ఐదు వేల మంది వరకు పౌరులు మృతి చెందారని శ్రీలంక మిలటరీ శాశ్విత కార్యదర్శి రాజీవ విజేసిన్హా తెలిపారు.

బ్రిటన్‌కు చెందిన గార్డియన్ వార్తాపత్రికతో రాజీవ మాట్లాడుతూ.. తన అంచనా ప్రకారం చివరి దశ పోరులో 3000 నుంచి 5000 మంది వరకు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయి ఉంటారన్నారు. ఎల్టీటీఈ తీవ్రవాదులు పౌరులను మానవ రక్షక కవచాలుగా ఉపయోగించుకోవడం వలనే ఈ మరణాలు సంభవించాయన్నారు.

చివరి దశలో 20 వేల మంది పౌరులు మృతి చెంది ఉండవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని రాజీవ విజేసిన్హా ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఏడు వేల మంది పౌరులు మృతి చెందారని ఐక్యరాజ్యసమితి తయారు చేసిన నివేదికను కూడా ఆయన తిరస్కరించారు.

వెబ్దునియా పై చదవండి