సయీద్ విడుదలపై అప్పీలు చేయనున్న పాక్

పాకిస్థాన్ హైకోర్టు ఆదేశాల మేరకు నిషేధిత జామాదుత్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి విడుదల కావడంపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తం అయ్యాయి. అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సయీద్‌ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలని కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేయనున్నట్లు పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం బుధవారం వెల్లడించింది.

లాహోర్ హైకోర్టు తీర్పుపై అప్పీలు చేయనున్నట్లు పంజాబ్ ప్రావీన్స్ న్యాయ శాఖ మంత్రి రాణా సానల్లా తెలిపారు. హఫీజ్, అతని సహాయకుడు పదవీ విరమణ చేసిన కల్నల్ నజీర్ అహ్మెద్ విడుదలను గురువారం లేదా శుక్రవారం కోర్టులో సవాలు చేస్తామన్నారు. తాజా పరిణామం కోర్టు నిర్ణయమైనప్పటికీ, తమను ఇబ్బందుల్లోకి నెట్టిందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు భారత్‌కు అవకాశం ఇచ్చిందని రాణా పేర్కొన్నారు.

గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల్లో సయీద్, ఇతర జామాదుత్ దవా అగ్రనేతలకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి ప్రమేయంతోనే ఈ దాడులు జరిగాయని భారత్ బలంగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిషేధిత లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ రాజకీయ ముసుగుగా వ్యవహరిస్తున్న జామాదుత్ దవాను కూడా తీవ్రవాద సంస్థగా ప్రకటించింది.

దీంతో డిసెంబర్ 11న పాకిస్థాన్ ప్రభుత్వం జామాదుత్ దవా అగ్రనేతలను గృహనిర్బంధంలో ఉంచింది. నిందితులు తమ గృహనిర్బంధం అక్రమం, రాజ్యాంగవ్యతిరేకమంటూ కోర్టును ఆశ్రయించారు. పాకిస్థాన్ ప్రభుత్వం ముంబయి దాడుల్లో వీరి ప్రమేయాన్ని నిరూపించేందుకు బలమైన ఆధారాలు ప్రవేశపెట్టలేకపోవడంతో మంగళవారం లాహోర్ హైకోర్టు జామాదుత్ చీఫ్ సయీద్‌ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి