కాశ్మీర్‌లో కల్లోలం.. ఐరాస నిద్రపోతోంది : విషంకక్కిన పాక్ క్రికెటర్

మంగళవారం, 6 ఆగస్టు 2019 (12:23 IST)
కాశ్మీర్‌లో కల్లోలం జరుగుతుంటే ఐక్యరాజ్య సమితి నిద్రపోతోందని పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సాహసోపేత నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. 
 
దీనిపై షాహిద్ ఆఫ్రిది స్పందించాడు. ఇదే అంశంపై ఆఫ్రిది ఓ ట్వీట్ చేశాడు. "ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కాశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. అసలు ఐరాస‌ను ఎందుకు ఏర్పాటు చేశారు? ఇంత జరుగుతున్నా ఎందుకలా నిద్రపోతోంది. కాశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఐరాస ఎందుకు స్పందించట్లేదు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి" అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
పైగా, కాశ్మీర్ అంశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. సదరు ట్వీట్‌ను ఐక్యరాజ్యసమితి, డొనాల్డ్ ట్రంప్‌కు ట్యాగ్ చేశారు. అలాగే, పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 
 
కాగా, కాశ్మీర్‌పై భారత ప్రభుత్వ చర్యపై పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇదివరకే ఖండించింది. ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని తెలిపింది. కాశ్మీరీలకు మద్దతు కొనసాగిస్తామని పేర్కొంది. తాజా పరిణామంతో రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు