జవాన్ల మెనూ మారింది.. 3వేల కెలోరీలు అందిస్తాం.. రోటీలు, చేప, జున్ను, పప్పు తప్పనిసరి..
జమ్మూకశ్మీర్లోని సరిహద్దు భద్రతా దళంలోని 29వ బెటాలియన్కి చెందిన తేజ్ బహదూర్ యాదవ్ అనే సైనికుడు.. వారు పడుతున్న కష్టాలన్నింటినీ వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.మాకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదు. కొన్ని సార్లు మేంఖాళీ కడుపులతోనే రోజులు గడుపుతున్నాం, అని పేర్కొంటూ నియంత్రణ రేఖ వద్ద గస్తీ బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు బీఎస్ఎఫ్ జవాన్లు సోషల్ మీడియాలో విడుదలచేసిన వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పహారా కాస్తున్న జవాన్లకు అందించే ఆహారం మెనూ మారింది. పలువురు అధికారులు కమిటీగా ఏర్పడి సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన క్యాంటీన్లు, స్టోర్లపై దాడులు చేస్తున్నారు. ఆహార నాణ్యతను పరీక్షిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉంటున్న జవాన్లకు ఎలాంటి ఆహరం అందుతోందనే అంశంపై దృష్టి పెట్టారు. ఆహార పదార్థాలు కొనడం దగ్గరి నుంచి జవాన్లకు చేరేవరకు చాలా జాగ్రత్త తీసుకుంటామని, ప్రతి జవాను అవసరాన్ని పరిగణనలోకి తీసుకుంటామని బీఎస్ఎఫ్ చెప్తోంది.
అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఆర్ఎస్ పురలో ఉన్న మెస్లోని మెనూలో రోటీలు, చేప, జున్ను, పప్పు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రతి జవానుకు తప్పనిసరిగా 3వేల కెలోరీలు అందిస్తామని.. ఎత్తైన ప్రదేశాల్లోని పోస్ట్లో ఉంటున్న వారికి 3,600 కెలోరీలు అందిస్తామని చెప్పారు. వారికి అదనంగా ఎండుఫలాలు, తేనె, టిన్నులో నిల్వ ఆహారం చేరవేస్తామని చెప్పారు.
ఆహారం చాలా నాణ్యతతో తయారుచేస్తామని, కమాండెంట్ రూపొందించిన మెనూను అనుసరిస్తామని ఆర్ఎస్ పురాలో పనిచేసే జూనియర్ అధికారి వెల్లడించారు. ఆహార నాణ్యతపై జవాన్ల ఫిర్యాదులు చాలా తక్కువని.. అందుకని కొన్నిచోట్ల వారి ఫిర్యాదులను కూడా కొట్టివేయలేమన్నారు. ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవారికి ఇబ్బంది ఉండొచ్చని ఆర్మీ అధికారులు తెలిపారు.