ఎస్ఓసీ‌ సదస్సు.. దాయాది దేశానికి పరోక్షంగా చురకలు అంటించిన భారత్!

ఠాగూర్

గురువారం, 17 అక్టోబరు 2024 (08:43 IST)
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా షాంఘై సహకార సంస్థ (ఎస్.ఓ.సి) సదసస్సు జరుగుతుంది. ఇందులో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పాల్గొని, దాయాది దేశం పాకిస్థాన్‌కు ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి అంశాలపై పరోక్షంగా చురకలు అంటించారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం ఉంటే దేశాల మధ్య సహకారం వృద్ధి చెందే అవకాశం లేదన్నారు. 
 
'సరిహద్దుల్లో తీవ్రవాదం, ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు కొనసాగుతుంటే ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, కనెక్టివిటీ వంటి తదితర రంగాల్లో సహకారం వృద్ధి చెందదు. నమ్మకం, సహకారం, స్నేహం లోపిస్తే ఆ దేశాలతో సంబంధాలు దూరమవుతాయి. అలాంటప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. 
 
ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి కారణాలు ఖచ్చితంగా ఉంటాయి. సహకారానికి దేశాల మధ్య పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వంపై ఆధారపడి ఉండాలి. అందుకు నమ్మకం చాలా ముఖ్యం. సభ్య దేశాల ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వాన్ని గుర్తించుకోవాలి. అందరూ కలిసి ఐక్యంగా ముందుకుగా సాగితేనే ఎస్​సీఓ సభ్య దేశాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అలాగే, ప్రపంచంలో ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన స్పందించారు. 'మనం క్లిష్ట సమయంలో కలుస్తున్నాం. ఇప్పుడు రెండు ప్రధాన సంఘర్షణలు జరుగుతున్నాయి. వాటి వల్ల సరఫరా గొలుసు నుంచి ఆర్థిక అస్థిరత వరకు - అన్నీ కలిసి వృద్ధి, అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటికే కొవిడ్ మహమ్మరి చాలా మందిని తీవ్రంగా నాశనం చేసింది. కల్లోల ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు తగిన విధంగా ఎస్‌సీఓ స్పందించాలి అని ఆయన పిలుపునిచ్చారు. కాగా, పాక్ గడ్డపై భారత విదేశాంగ మంత్రి అడుగుపెట్టడం తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు