ఫ్లైట్ జర్నీ అంటే కిమ్‌కు భయం.. అందుకే బుల్లెట్ ప్రూఫ్ రైలులో .. ఈ రైలు ప్రత్యేకతలెన్నో...

మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (12:00 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తమ సొంత రైలులో రష్యాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇందుకోసం ఆయన రైలులో ప్రయాణించి మాస్కోకు చేరుకున్నారు. విమాన ప్రయాణమంటే భయపడే కిమ్... ఏకంగా 681 కిలోమీటర్ల దూరం రైలులోనే ప్రయాణం చేశారు. తమ తండ్రి, తాతలకు గౌరవ సూచకంగానే తమ అధినేత రైలు ప్రయాణం చేస్తుంటారని నార్త్ కొరియా ప్రకటించింది. 
 
ఈ బుల్లెట్ ప్రూఫ్ రైలు వస్తుంటే మిగిలిన రైళ్లు ఎక్కడివక్కడే ఆగిపోవాల్సిందే. కిమ్ ప్రయాణించే మార్గంలో స్టేషన్లకు సైనికులు ముందే చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అందులో భాగంగా రైల్వే స్టేషన్లలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో రైళ్లన్నీ ఎక్కకడివి అక్కడే ఆగిపోయారు. భద్రత కోసం చేసిన ఏర్పాట్ల వల్ల ఈ ప్రత్యేక రైలు వేగం చాలా తక్కువ. గరిష్టంగా గంటకు 59 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణం చేస్తుంది. 
 
ఇందులో కిమ్‌ ప్రయాణించే కార్లు కూడా ఉంటాయి. రైలులో మొత్తం 91 కోచ్‌లు ఉంటాయి. లోపల అధ్యక్షుడి కోసం విలాసవంతమైన ఏర్పాట్లు, పొడవైన టేబుళ్లు, ఫ్లాట్ స్క్రీన్ మానిటర్లను అమర్చారు. ట్రాక్‌లను పరీక్షిస్తూ ఓ ట్రైన్ ముందు వెళుతుంటే, ఆ తర్వాత భద్రతా సిబ్బందిని మోసుకుంటూ మరో ట్రైన్ వెళుతుంది. వీటి వెనుక కిమ్ ప్రయాణించే రైలు వెళుతుంది. ఇందులో రష్యాన్, ఫ్రెంచ్, జపనీస్, కొరియన్, చైనీస్ వంటకాలు అప్పటికపుడు వండి వడ్డించేలా ఏర్పాట్లు ఉంటాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు