మోడీ - ఘనీ వ్యాఖ్యలపై పాక్ ఆక్రోశం... మమ్మల్నే నిందించడం తగదు

ఆదివారం, 4 డిశెంబరు 2016 (16:33 IST)
ఆసియా ఖండాన్ని ఉగ్రవాదం పట్టి పీడిస్తోందని, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరమని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు గట్టిగా బుద్ధి చెప్పాలని 'హార్డ్ ఆఫ్ ఆసియా' సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనిలు వ్యాఖ్యానించారు. పనిలోపనిగా పాకిస్థాన్‌పై నిప్పులు చెరగారు. దీన్ని పాక్ తప్పుపట్టింది. 
 
ఉగ్రవాదానికి ఒక దేశమే కారణమన్నట్టు నిందలు మోపడం తగదని వ్యాఖ్యానించింది. 'ఒక దేశాన్ని (పాక్) నిందించడానికి బదులు సహేతుకమైన కారణాలను విశ్లేషించడం, విశాల దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది' అని పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజిజ్ 'హార్ట్ ఆఫ్ ఆసియా' సదస్సులో పేర్కొన్నట్టు పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ తెలిపారు.
 
అపరిష్కృత వివాదాలపై శాంతియుత పరిష్కరం వల్ల ప్రాంతీయ సహకారం మెరుగవుతుందని సదస్సులో అజీజ్ సూచించారని, ఆప్ఘనిస్థాన్‌లో ఇటీవల హింసాయుత సంఘటనలు పెరగడంపై కూడా అజిజ్ ప్రస్తావిస్తూ దానిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఘనీదేనని స్పష్టం చేశారని బాసిత్ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి