గల్ఫ్ కంపెనీ నీచమైన పని.. ఉద్యోగిని డ్రగ్స్ కేసులో ఇరికించి?

శుక్రవారం, 24 మే 2019 (13:27 IST)
గల్ఫ్ దేశంలోని ఓ కంపెనీ యజమాని ప్రవాసీయుడు తన సంస్థలో పని చేయడం సహించలేక అతడిని వెళ్లగొట్టేందుకు పన్నాగం పన్నింది. సాధారణంగా గల్ఫ్ దేశాల చట్టాల ప్రకారం డ్రగ్స్‌తో పట్టుబడితే కఠిన శిక్షలు ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ఆమె ఎలాగైనా ఆ ఉద్యోగిని డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూసింది. 
 
మత్తు పదార్థాలతో అతను పోలీసులకు పట్టుబడితే దేశ బహిష్కరణతో పాటు జైలు శిక్ష, వీసా రద్దు కావడం జరుగుతాయని భావించి, డ్రగ్స్‌కు బానిసైన ఓ వ్యక్తి సాయంతో ఆ ఉద్యోగి కారులో మత్తు పదార్థాలు ఉంచి, తన పథకాన్ని అమలు చేసింది. అయితే టైం బాగోలేక సీన్ రివర్స్ కావడంతో పోలీసులకు చిక్కింది.
 
ఈ కేసులో రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు యజమానురాలు, ఆమె భర్త, మేనల్లుడితో పాటు డబ్బు ఆశతో ఈ పనిచేయడానికి ఒప్పుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ ఉద్యోగి ఆసియా వాసి కావడంతో అతన్ని ఎలాగైనా తమ దేశం నుంచి బహిష్కరించాలనే ఈ పని చేసినట్లు ఆ నలుగురు అంగీకరించినట్లు పోలీసుల తెలియజేసారు. 
 
నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానంలో ప్రధాన నిందితుడు తాను కారులో డ్రగ్స్ ఉంచినప్పుడు మత్తులో ఉన్నానని, తనకు ఎవరు ఈ పని చేయమని అడగలేదని చెప్పాడు. దాంతో నిందితుల తరఫు న్యాయవాది తన క్లైంట్స్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. 
 
అలాగే నిందితుడు ఎవరి ప్రొద్బలం లేకుండా నేరాన్ని అంగీకరించాడు కావున తన క్లయింట్స్ నిర్దోషులని లాయర్ తెలిపాడు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు తన క్లయింట్స్ తప్పు చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నిందితుల తరఫు న్యాయవాది కోర్టులో విన్నవించారు. వాదోపవాదాలు విన్నా తరువాత న్యాయస్థానం తుది తీర్పును ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
Gulf news 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు