ఎన్.ఆర్.ఐ భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య..

బుధవారం, 8 మే 2019 (12:45 IST)
హైదరాబాద్ రామాంతపూర్‌కు చెందిన జువాడి శ్రీలత అదనపు కట్నం వేధింపులు భరించలేక ముంబయిలోని తన మేనమామ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం 2012లో వంశీరావుతో శ్రీలతకు వివాహం జరిగింది. వెంటనే భర్తతో కలిసి లండన్‌ వెళ్లిపోయిన శ్రీలత కాపురం సాఫీగానే సాగింది. శ్రీలత తల్లి చనిపోవడం, 2016 శ్రీలత గర్భవతి కావడంతో ఆమెకు తోడుగా ఉండటం కోసం అత్త ఆశాలత లండన్‌ వెళ్లింది.
 
అక్కడ పాపకు జన్మనిచ్చిన శ్రీలతకు భర్త, అత్త నుంచి వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో 2018 ఫిబ్రవరిలో లండన్‌లోనే శ్రీలత ఒకసారి రైలుకింద పడి ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెబుతున్నారు ఆమె బంధువులు. గత సంవత్సరం జూన్‌లో అంతా కలిసి హైదరాబాద్‌ వచ్చినా శ్రీలతను, పాపను రామంతాపూర్‌లోనే వదిలి వంశీరావు ఒక్కడే తిరిగి లండన్‌ వెళ్లిపోయాడు. అయితే గత 10 నెలలుగా శ్రీలత అత్తమామలు దగ్గర ఉండటంతో వారి వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక ముంబయిలోని మేనమామ ఇంటికి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకుంది. 
 
శ్రీలత మృతదేహాన్ని ముంబయి నుంచి మంగళవారం రాత్రి రామాంతపూర్ లోని అత్తమామల ఇంటికి తీసుకువచ్చారు. విషయం తెలిసి అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంతో మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచారు. ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్తమామలను శిక్షించే వరకూ న్యాయపోరాటం చేస్తామని భర్త ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు బంధువులు. శ్రీలతకు భర్త, అత్తమామలు పెట్టే వేధింపులు భరించలేకే శ్రీలత తల్లి మానసిన వేధన అనుభవించి చనిపోయిందని వాపోతున్నారు మృతురాలు బంధువులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు