చైనా అండతో రెచ్చిపోయిన నేపాల్.... భారత్‌తో కవ్వింపు చర్యలు

సోమవారం, 29 జూన్ 2020 (08:50 IST)
మిత్రదేశంగా భావించే నేపాల్ ఇపుడు చైనా అండ చూసుకుని మరింతగా రెచ్చిపోతోంది. భారత్‌ను రెచ్చ గొడుతూ నిత్యం కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా ఆ దేశ ప్రధానమంత్రి కేపీ ఓలీ శర్మ మరింతగా రెచ్చిపోయారు. భారత్‌పై అర్థంపర్థం లేని అభాండాలు వేస్తూ తనను ఏమీ చేయలేరంటూ బహిరంగ ఛాలెంజ్ విసిరారు. 
 
పైగా, తన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు భారత్ కుట్ర పన్నిందని, ఖాట్మండూలోని భారత రాయబార కార్యాలయం నుంచే ఈ ఆపరేషన్ నడుస్తోందని ఆరోపించారు. కానీ తనను తొలగించడం సాధ్యం కాదని ఓలీ అన్నారు. 
 
నేపాలీ మ్యాప్‌లో భారత భూములను చూపించే రాజ్యాంగ సవరణ జరిగినప్పటి నుంచి తనపై కుట్రలకు పథకాలు రచిస్తున్నారని ప్రధాని ఓలీ ఆరోపించారు. తనను తొలగించడానికి బహిరంగ పందెమే కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. 
 
అయితే నేపాల్ జాతీయత అంత బలహీనంగా లేదని, మ్యాప్‌ను ముద్రించినంత మాత్రాన ప్రధానమంత్రిని తొలగించాలని తమ పౌరులు అనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
 
కాగా, ఇటీవల భారత్‌కు చెందిన లిపులేఖ్, కళాపాణి, లింపియాధురా ప్రాంతాలను తమ దేశ పరిధిలోకి చేర్చి, వాటితో రూపొందించిన కొత్త రాజకీయ పటాన్ని తయారు చేసింది. దీనికి రాజ్యాంగంలో చేసిన సవరణను నేపాల్ పార్లమెంటు జూన్ 13న ఆమోదించింది. 
 
అయితే దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్ ఇలాంటి పనులు మానుకోవాలని, ఆ మూడు ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమని హెచ్చరించింది. అయినప్పటికీ నేపాల్ ప్రధాని తనదైనశైలిలో రెచ్చిపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు