అణుశక్తి సరఫరా బృందం(ఎన్ఎస్జీ)లో సభ్యత్వాన్ని అమెరికా భారత్కు బహుమతిగా ఇవ్వాలని చూస్తోందని చైనా చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. అమెరికా ఇచ్చే వీడ్కోలు బహుమతిలాగా ఎన్ఎస్జీలో సభ్యత్వాన్ని భారత్ కోరుకోవడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. గత కొన్నాళ్లుగా ఎన్ఎస్జీలో సభ్యత్వానికి భారత్ యత్నిస్తుండగా.. ఎన్పీటీపై సంతకం చేయకుండా ఎలా సభ్యుడిగా చేర్చుకుంటారని చైనా మోకాలు అడ్డుపెడుతోంది.
కాగా, రాయబారి రిచర్డ్ వర్మ మాత్రం ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనా అడ్డంకిని అధిగమించి భారత్కు ఎన్ఎస్జీలో సభ్యత్వాన్ని కల్పిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కూడా ఎన్ఎస్జీలో సభ్వత్వాన్ని కోరుతుండటంతో చైనా ఆ దేశంతోనూ సంప్రదింపులు జరుపుతోంది.
భారత్కు మొదటినుంచి అనుకూలంగా ఉంటూ అణు సరఫరాదారుల బృందంలో ఇండియాకు సభ్యత్వం కల్పించడానికి తీవ్రగా ప్రయత్నించిన ఒబామా పాలనా యంత్రాంగాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా విదేశాంగ మంత్రి హువా చునియింగ్ ఈ బహుమతి ప్రస్తావన తెచ్చారు. ఎన్ఎస్జిలో సభ్యత్వం అనేది దేశాలకు ఇచ్చే వీడ్కోలు బహుమతి కాదని హువా దెప్పిపొడిచారు.
పైగా అణుపరీక్షల నిషేధ ఒప్పందంపై సంతకం చేయని దేశాలకు గ్రూపులో ప్రవేశం కల్పించడానికి రెండు దశల వైఖరిని తాము సూచిస్తున్నామని, దీనిపై సరైన పరిష్కారం చర్చల ద్వారా లభిస్తే ఎన్ఎస్జీలో చేరాలనుకునే అన్ని దేశాలకు మేలు చేకూరుతుదని చైనా మంత్రి వ్యాఖ్యానించారు.
చైనా ఉద్దేశాన్ని సరిగ్గానే గమనించిన భారత్ దీటుగా సమాధానమిచ్చింది. ఆయాచితంగా ఎవరో దయతల్చి ఇచ్చే బహుమతి తమకు వద్దని, తగిన అర్హతలు ఉన్నాయి కనుకనే తాము ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నామని భారత విదేశాంఖ శాఖ స్పష్టం చేసింది.